ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయం.. మోడీకి విశాఖ శారదా పీఠం కితాబు
విశాఖపట్నం : దేశ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఏళ్లకు ఏళ్లుగా జమ్ము కశ్మీర్ సమస్యకు దొరకని పరిష్కారం చిటికెలో సాధ్యమైంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఆ మేరకు జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు సంబంధించి తొలి ఘట్టం ముగిసింది. సోమవారం నాడు రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ క్రమంలో దాదాపు పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి.
ఆర్టికల్ 370 రద్దు బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ఓటింగ్కు అనుమతించారు. అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేశారు. 61 మంది సభ్యులు వ్యతిరేకించారు. మెజార్టీ సభ్యులు ఓకే చెప్పినట్లు నిర్ధారించి ఆ మేరకు కశ్మీర్ పునర్విభజన బిల్లు పాస్ అయినట్లుగా వెంకయ్యనాయుడు ప్రకటించారు. జమ్ము కశ్మీర్ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. లడఖ్ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ ఆమోద ముద్ర వేశారు.

ఆర్టికల్ 370 రద్దుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద, ఉత్తరాధికారి స్వాత్మానంద. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భేష్ అంటూ ఇరువురు కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంలో అభినందనీయులని కితాబిచ్చారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ఆర్టికల్ 370 రద్దు దోహదపడుతుందన్నారు. ఇన్నాళ్లు కశ్మీర్లో అడుగుపెట్టే పరిస్థితి లేదని.. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో దేశంలోని శక్తి పీఠాలు అన్నింటినీ సందర్శించే భాగ్యం కలగబోతుందన్నారు. ఇకపై జమ్మూకశ్మీర్ ప్రజల సమగ్ర వికాసం సాకారమవుతుందని ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వం సరస్వతీ శక్తి పీఠ పునరుద్దరుణకు ఒకవేళ పూనుకుంటే మాత్రం శారదా పీఠం సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు అనేది కశ్మీర్లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు ఉపయోగపడుతుందని తెలిపారు. రామ జన్మభూమి, గోరక్షణ విషయాల్లోనూ ఇదే తరహాలో తక్షణ చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. భారత దేశపు అధికారిక ఆధ్యాత్మిక చిహ్నంగా గోవును ప్రకటించాలని కోరారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే గనక హిందువులంతా మోడీని అభినవ వివేకానందుడిగా కీర్తిస్తారని అన్నారు.












Click it and Unblock the Notifications