విశాఖ కేంద్రంగా బీజేపీలో టార్గెట్ వీర్రాజు రాజకీయం - విజయ సాయిరెడ్డి ఎఫెక్ట్..!!
విశాఖలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో కొత్త అసంతృప్తి మొదలైంది. ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటనకు సంబంధించి బీజేపీ నేతలకు సమాచారం లేదు. ఆలస్యంగా ప్రధాని వస్తున్న సంగతి మాత్రమే నామ మాత్రంగా సమాచారం ఇచ్చారు. దీని పైన ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రధాని పర్యటన పైన తమకు సమాచారం ఇవ్వరా అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పైన కోర్ కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసారు.
ప్రధాని విశాఖకు వచ్చి..కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న సమయంలో బీజేపీ అనుకూలంగా మలచుకోవాల్సిన అవసరం లేదా అంటూ వీర్రాజును ప్రశ్నించారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్య నేతలు పురంధేశ్వరి.. సీఎం రమేష్.. సత్యకుమార్ తో పాటుగా మిగిలిన నేతలు ఉన్నారు. ఇందులో మోదీ విశాఖ పర్యటన పైన ప్రధానంగా చర్చించారు. కోర్ కమిటీలో చర్చించకుండా..జిల్లా కమిటీతో మాట్లాడి ఎలా ఏర్పాట్లు చేయిస్తారని పార్టీ నేతలు సోము వీర్రాజును ప్రశ్నించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఎంపీ విజయ సాయిరెడ్డి పర్యవేక్షించటం ఏంటని నేతలు నిలదీసారు. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తాజాగా సాయిరెడ్డి చేసిన ప్రకటన పైనా వారు అసంతృప్తి వ్యక్తం చేసారు.
వైసీపీ ఎంపీగా ఉన్న ఆయన బీజేపీ నేతలకు సమాచారం ఇవ్వకుండా ఏర్పాట్లు చేయటం ఏంటని నిలదీసారు. ప్రధాని పర్యటనను వైసీపీ ఎలా క్లెయిమ్ చేసుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ నేతల ప్రమేయం లేకుండా సాయిరెడ్డి ఎలా అన్ని నిర్ణయాలు వెల్లడిస్తారంటూ పార్టీ నేతలు సోము వీర్రాజు లక్ష్యంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించారు. ప్రధాని పర్యటన కు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నామని..ఇందులో రాజకీయాలకు తావు లేదని కొద్ది రోజుల క్రితం విజయ సాయిరెడ్డి స్పష్టం చేసారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు జనసమీకరణ బాధ్యతలను విశాఖ మంత్రులు..స్థానిక నేతలు తీసుకున్నారు. అదే సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పరిపాలనా కార్యాలయం శంకుస్థాపన గురించి బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో శంకుస్థాపన చేస్తే ఆ క్రెడిట్ వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని పార్టీ జాతీయ నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ఢిల్లీ నుంచి అందిన షెడ్యూల్ మేరకు రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు ప్రధాని కార్యక్రమం.. షెడ్యూల్..అతిథులు ఎవరనేది ప్రోటోకాల్ ప్రకారమే నిర్ణయం జరిగే అవకాశం ఉండటంతో, ప్రధాని పర్యటనలో బీజేపీ నేతలకు ఏ మేర ప్రాధాన్యత ఉంటుందనేది సందేహమే. విశాఖ కేంద్రంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వేళ.. ప్రధాని పర్యటనను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.