గ్యాస్ లీక్ ఘటనపై చంద్రబాబు విచారం.. బాధ్యులపై చర్యలు
విశాఖ సమీపంలో గల అచ్యుతాపురం సెజ్ బ్రాండిక్స్ కంపెనీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకయిన సంగతి తెలిసిందే. 200 మంది అస్వస్ధతకు గురయ్యారు. ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో విషవాయువు లీక్ అయిన ఘటన ఆందోళన కలిగించిందన్నారు. గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవటం విచారకరమని చంద్రబాబు అన్నారు.
అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవడమే కాకుండా నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు కామెంట్ చేశారు. అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారి తీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు.

సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్యాస్ లీక్ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications