విశాఖలో రూ.14,000 కోట్ల భారీ ప్రాజెక్ట్- జగన్ హ్యాపీ: మార్చిలో ముహూర్తం పెట్టేశారు
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మూడు రాజధానుల అంశం.. ముందుకు కదులుతోంది. ఆ దిశగా ఒక్కో అడుగు పడుతోంది. ఈ ఏడాది ఉగాది నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు ఈ విషయంపై లీకులు కూడా ఇస్తోన్నారు. విశాఖకు తరలి వెళ్లడంలో ఇక ఏ మాత్రం జాప్యం జరక్కపోవచ్చనీ వ్యాఖ్యానిస్తోన్నారు.
ఇంటర్నేషనల్ సమ్మిట్స్..
ఇప్పటికే- అనధికారికంగా విశాఖపట్నం రాజధాని హోదాను పొందినట్టే కనిపిస్తోంది. సాధారణంగా రాష్ట్ర రాజధానుల్లో ఏర్పాటయ్యే జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, వర్క్షాప్స్ ను విశాఖలో నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగమే జీ20 సమ్మిట్ కూడా. జీ 20 సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 9,10 తేదీల్లో షెడ్యూల్ అయింది.
మార్చిలో..
ఇందులో భాగస్వామిగా ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా, జపాన్, ఫ్రాన్స్..వంటి 20 దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరు కానున్నారు. ఈ సదస్సు సన్నాహాక సమావేశాలను విశాఖపట్నంలో నిర్వహించనుంది ప్రభుత్వం. అదే క్రమంలో- అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను కూడా విశాఖపట్నంలోనే షెడ్యూల్ చేసింది. మార్చి 3, 4 తేదీల్లో ఈ ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు కానుంది.
14,000 కోట్ల ప్రాజెక్ట్..
ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 14,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ ఇది. అదాని గ్రూప్ ఆఫ్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ దీన్ని నెలకొల్పనున్నారు. దీన్ని నెలకొల్పడానికి విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ను ఏడు సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా పూర్తి చేసే అవకాశం ఉంది.
24,000 మందికి జాబ్స్..
ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక- 24,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ ను నెలకొల్పడానికి జగన్ ప్రభుత్వం 2021లో విశాఖపట్నంలో 130 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో 20 సంవత్సరాల పాటు పన్ను రాయితీని కూడా ఇవ్వడానికి అంగీకరించింది.
టయర్ 1 సిటీగా..
విశాఖపట్నాన్ని రాజధానిగా, టయర్-1 సిటీగా మార్చాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో- రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఈ మెగా ప్రాజెక్ట్ను చేపట్టింది. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఈ అదానీ డేటా సెంటర్ ఓ గేమ్ ఛేంజర్గా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్ ఎడ్జ్కనెక్స్ జాయింట్ వెంచర్ గా దీన్ని నెలకొల్పనున్నాయి.