చెప్పింది చేస్తోన్న వైఎస్ జగన్- తాడేపల్లి క్యాంప్ కార్యాలయం విశాఖకు షిఫ్ట్
విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చబోతోన్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలే ప్రకటించారు. తాను కూడా అక్కడికే తరలి వెళ్లనున్నట్లూ స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా క్యాంప్ కార్యాలయం, నివాసాన్ని సిద్ధం చేసుకుంటోన్నారు.
అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అధికార వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. ఒకవంక కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తూనే మరోవంక- నిర్మాణాలకూ పూనుకుంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత.. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మరో కీలక అడుగు వేసింది అధికార పార్టీ. పార్టీ పరంగా తరలింపు పనులను మొదలు పెట్టింది.

జాప్యం లేకుండా..
విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతోన్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. విశాఖకు తరలి వెళ్లడంపై తొలిసారిగా దేశ రాజధానిలో పెదవి విప్పారు. తాను కూడా త్వరలోనే విశాఖకు తరలి వెళ్లబోతోన్నానని, పెట్టుబడులు పెట్టడానికి అక్కడ అనువైన వాతావరణం ఉందంటూ ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో స్పష్టం చేశారు. అమరవతి నుంచి సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం తరలి వెళ్లడం ఇక ఖాయమైంది.

రెండు నెలల్లోగా..
ఏప్రిల్ లోగా రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తామంటూ అదే రోజు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించే విషయంలో ఎలాంటి రాజీధోరణిని పాటించే ప్రసక్తే లేదని, ఏప్రిల్ నాటికి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఖాళీ భవనాల్లో..
విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటి నుంచి పరిపాలన సాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయని అన్నారు. భీమిలి రోడ్డులోని భవనాలనే సెక్రటేరియట్ గా వాడుకుంటామనీ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

జోరుగా నిర్మాణ పనులు..
ఈ పరిణామాల మధ్య తాజాగా మరో అప్ డేట్ వెలువడింది. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంప్ కార్యాలయం శరవేగంగా రూపుదిద్దుకుంటోన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తన కేంద్ర కార్యాలయం భవన నిర్మాణ పనులను చేపట్టింది. గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన ఎండాడ పనోరమా హిల్స్లో వైవీ సుబ్బారెడ్డి ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడా పనులు ఊపందుకున్నాయి. క్యాంప్ కార్యాలయం కూడా అందులోనే ఏర్పాటు కానుంది.

మార్చి 22న..
మార్చి 22వ తేదీన వైఎస్ జగన్ విశాఖపట్నంలో క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజున గృహప్రవేశం కూడా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ఆయన వైవీ సుబ్బారెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లోగా తరలి వెళ్తామంటూ ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక జాప్యం జరక్కపోవచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications