Cyclone Asani: తరుముకొస్తోన్న తుఫాన్: ఉత్తరాంధ్ర అలర్ట్: పొరుగు రాష్ట్రంపై ప్రభావం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాన్.. తీరం వైపు కదులుతోంది. ఏపీ, ఒడిశా దిశగా దూసుకొస్తోంది. మంగళ, బుధవారాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తుఫాన్ బంగాళాఖాతంలో ఒడిశాలోని పూరీ తీరానికి వాయవ్య దిశగా 1,180, విశాఖపట్నానికి 1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా తీరం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాన్ వల్ల ఒడిశా దక్షిణం, ఏపీ ఉత్తర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఇదే విషయాన్ని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే జెనా ధృవీకరించారు. అసాని తుఫాన్ కదలికలపై వాతావరణ కేంద్రం అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని అన్నారు. మంగళ, బుధ వారాల్లో ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలంటూ స్థానిక అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Deep depression formed over southwest Bay of Bengal, about 300km west-southwest of Port Blair. To move northwestwards & intensify into a cyclonic storm over southeast Bay of Bengal by morning & into a severe cyclonic storm over Easterncentral Bay of Bengal by evening today: IMD pic.twitter.com/wTN4HpXjoQ
— ANI (@ANI) May 7, 2022
ప్రస్తుతం ఈ తుఫాన్ అండమాన్ నికోబార్ ద్వీప సముదాయానికి సమీపంలో ఉంది. కార్ నికోబార్కు 280, పోర్ట్బ్లెయిర్కు 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఇది. ఆగ్నేయ దిశగా కదులుతోందని, ఈ సాయంత్రానికి ఏపీ-ఒడిశా తీర ప్రాంతాలకు మరింత చేరువగా వస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అటు పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంతంపైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 10 లేదా 11వ తేదీ నాటికి తీరానికి సమీపిస్తుందని వివరించారు.
అనంతరం ఉత్తరం-ఈశాన్య దిశగా తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మొహపాత్ర చెప్పారు. తీరాన్ని తాకే అవకాశం ప్రస్తుతానికి లేదని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఇది తీవ్ర వాయుగుండంగా మారిందని అన్నారు. తుఫాన్ సమీపించిన సమయంలో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు దీని ప్రభావానికి గురయ్య రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు స్పష్టం చేశారు.