ఏంటీ అనాగరికం: మరో దళిత యువకుడికి శిరోముండనం
విశాఖపట్నం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం దళిత యువకుడి శిరోముండనం ఘటన మరువక ముందే విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో మరో యువకుడికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలను బాధితుడు పర్రి శ్రీకాంత్ పోలీసులకు వివరించాడు. పెందుర్తి సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్ అదే కాలనీలో నివాసం ఉంటున్న సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో మూడు నెలలపాటు పనిచేశాడు. కరోనా కారణంగా నెల రోజుల నుంచి శ్రీకాంత్ అక్కడ పనిమానేశాడు.
చెప్పకుండా పని మానేశాడనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్ చోరీ చేశాడని నూతన్ నాయుడు కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనిపై మాట్లాడాలని ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాంత్ అక్కడికి వెళ్లాడు. మిగితా సిబ్బంది చూస్తుండగానే నూతన్ నాయుడు భార్య శ్రీకాంత్కు గుండు గీయించి, ఆ తర్వాత దాడి చేశారు.
ఈ విషయాన్ని బయటికి చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియా ద్వారా బయటికి రావడంతో పోలీసులు స్పందించారు. బాధితుడు శ్రీకాంత్ను పిలుపించుకుని ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరంలో ఓ దళిత యువకుడి శిరోముండనం ఘటన రాస్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపం చెందిన బాధితుడు నక్సలైట్లలో కలిసేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు కూడా లేఖ రాశారు. దీంతో రాష్ట్రపతి కార్యాలయం ఈ ఘటనపై సీరియస్గా స్పందించింది.
ఈ ఘటనపై పరిశీలించాలని ఏపీ జేఏడీ సహాయ కార్యదర్శి జనార్ధన్ బాబుకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. అనంతపురం జనార్ధనబాబును తాను సంప్రదించినా స్పందనలేదని బాధితుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.