ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో రాజకీయాలు తగదు ..ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం : వైసీపీ మంత్రులు
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ దుర్ఘటన ఏపీలో రాజకీయ వేడిని రగిల్చింది . సంస్థను కాపాడటం కోసమే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువగా మారాయి. ఎల్జీ పాలిమర్స్ తో సీఎం జగన్ ఎయిర్ పోర్ట్ లోనే లోపాయికారీ ఒప్పందం చేసుకుని వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు . అయితే ప్రభుత్వం ఈ ఘటనపై హై పవర్ కమిటీ వేసిందని చెప్పి , కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటారని వైసీపీ మంత్రులు చెప్తున్నారు.
Recommended Video

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఆందోళన .. నచ్చజెప్తున్న మంత్రులు
ఇక తాజాగా ఎల్జీ పాలిమర్స్ ముందు సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు . తమకు ఎలాంటి మెడికల్ క్యాంపులు, షెల్టర్లు లేవని, అంతా కలుషితమైందని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుంటాయంటూ ఆర్ ఆర్ వెంకటాపురంలో యువత ఆందోళన బాట పట్టారు. తమను పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు మంత్రులను నిలదీశారు. కనీసం మంచినీళ్లు కూడా లేకుండా తాము అవస్థలు పడుతుంటే ఇక కంపెనీ అధికారులు ఏసీ రూమ్ల నుంచి బయటకు రావడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు మంత్రులకు తమ గోడు చెప్పుకోగా మంత్రి అవంతి శ్రీనివాస్ వారికి నచ్చచెప్పారు.

గ్యాస్ లీక్ ఘటన గ్రామాలను సందర్శించిన మంత్రులు .. ప్రజలే ముఖ్యమని వివరణ
ఇక తాజాగా సంఘటనా స్థలాన్ని పరిశీలించటానికి వైసీపీ మంత్రులు బొత్సా సత్యన్నారాయణ , కురసాల కన్నబాబు , అవంతి శ్రీనివాస్ వైజాగ్ వెళ్ళారు. అక్కడ వారు టీడీపీ ఈ ఘటనపై కూడా రాజకీయాలు చెయ్యటం దారుణం అని వ్యాఖ్యానించారు . ప్రజల భద్రతే ముఖ్యమని కంపెనీ కాదని మంత్రులు బొత్సా సత్యనారాయణ ,అవంతి శ్రీనివాస్ , కురసాల కన్నబాబు పేర్కొన్నారు . మంత్రులు శనివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు . ఇక ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని, దర్యాప్తు జరుగుతుందని , కంపెనీ తప్పని తేలితే కఠిన చర్యలకు ప్రభుత్వం వెనకాడదని తెలిపారు.

ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చెయ్యొద్దన్న వైసీపీ మంత్రులు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని అన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు సున్నితమైన సమయంలో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని పేర్కొన్నారు వైసీపీ మంత్రులు . ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. మృత దేహాలను త్వరగా తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, కరోనా తీవ్రత దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఇక ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాలా రక్షణా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications