ఉక్కు ఆందోళనలకు స్వల్ప ఎన్నికల విరామం .. భారీ భద్రత నడుమ కొనసాగుతున్న విశాఖ నగర పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రం మొత్తం కొనసాగుతున్న పోలింగ్ ఒకెత్తయితే, సాగర తీర నగరం విశాఖలో జరుగుతున్న పోలింగ్ అధికారులకు మరో ఎత్తుగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉధృతంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ పోలింగ్ అధికారులకు కత్తి మీద సాములా తయారైంది.

విశాఖ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కంటే అధికంగా, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విశాఖ నగరంలో 98 వాదులకు 98 జోనల్ మెజిస్ట్రేట్ లను నియమించినట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విశాఖలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.

గత ఎన్నికల పోలింగ్ కంటే అధికంగా పోలింగ్ శాతం కోసం అధికారుల తిప్పలు
2007 సంవత్సరంలో జరిగిన జివిఎంసి ఎన్నికల్లో 52.48 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది . అయితే ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లకు పిలుపునిచ్చారు అధికారులు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాలను కూడా వారికి సమీపంలోనే ఏర్పాటు చేశామని వెల్లడించారు. జీవీఎంసీ 98 వార్డుల్లో మొత్తం 566 మంది, ఎలమంచిలి లో 22 వార్డులకు 62 మంది, నర్సీపట్నంలో 28 వార్డులకు 78 మంది పోటీలో ఉన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళనలు ... జాతీయ రహదారి దిగ్బంధనానికి బ్రేక్
ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనలో భాగంగా ధర్నాలు, ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ, ఈ ఒక్క రోజు ఎన్నికల విరామంగా జాతీయ రహదారి దిగ్బంధనాన్ని విరమించుకున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. మరోవైపు కూర్మన్నపాలెం లో 27 వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి . ఉక్కు నిర్వాసితులు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శిబిరాల్లో రిలే దీక్షల్లో పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు.

ఉక్కు ఉద్యమం ఎఫెక్ట్ ఎన్నికలపై ఉంటుందా ? సర్వత్రా ఉత్కంఠ
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం ద్వారా తమకు కేంద్రం అన్యాయం చేసిందని, కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మొత్తానికి విశాఖ ఉక్కు కోసం ఆందోళనలు కొనసాగుతున్న వేళ , విశాఖలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ఎవరికి అనుకూలంగా మారనుంది అనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది . అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖలో కొనసాగుతున్న కార్పొరేషన్ ఎన్నికల పై రాష్ట్ర వ్యాప్త ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications