విశాఖలో అమరావతి మెట్రోరైలు కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు: తరలింపు ఆరంభమైనట్టేనా?
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తోంది. పరిపాలనకు అనువైన భవనాల అన్వేషణ కొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. విజయవాడ ప్రధాన కేంద్రంగా కొనసాగుతూ వస్తోన్న అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఏఎంఆర్సీఎల్) ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో నెలకొల్పబోతోంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
విశాఖపట్నం మెట్రో రైలు కార్యకలాపాల కోసమే..
విశాఖపట్నంలో వాహనాల రద్దీని నియంత్రించడంలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. విశాఖలో 79.91 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించడానికి అవసరమైన డీపీఆర్లను రూపొందించడానికి కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్లో భాగంగా విశాఖ ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చింది. లైట్ మెట్రో అండ్ మోడర్న్ ట్రామ్ కారిడార్ పనులు కూడా దీని కిందికే తీసుకొచ్చింది.
విశాఖ ప్రాజెక్టు కోసం ప్రాంతీయ కార్యాలయం..
అదే క్రమంలో- ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడానికి వీలుగా అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులను ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. రామకృష్ణా బీచ్ వెంబడి విశాఖపట్నం నుంచి భీమిలీ వరకు నిర్మించడానికి ప్రతిపాదించిన లైట్ మెట్రో అండ్ మోడర్న్ ట్రామ్ కారిడార్ ప్రాజెక్టు పనులు కూడా విశాఖ మెట్రోరైలు ప్రాంతీయ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తారు.
డీపీఆర్, భూసేకరణ సహా..
ప్రతిపాదిత 79.91 కిలోమీటర్ల విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 60 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులన్నీ ఇక ఈ ప్రాంతీయ కార్యాలయం నుంచే కొనసాగుతాయి. ఈ కార్యాలయాన్ని విశాఖలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా తెలియ రాలేదు. తాత్కాలికంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) భవనంలోనే ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. డీపీఆర్, భూసేకరణ పనులు, బిడ్డింగ్.. వంటి పరిపాలనాపరమైన లావాదేవీలన్నింటికీ ప్రాంతీయ కార్యాలయమే కేంద్రబిందువు కానుంది.
Recommended Video
ప్రధాన కార్యాలయం విజయవాడలోనే..
రాజధాని అమరావతి ప్రాంతం నుంచి సచివాలయం సహా ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలన్నింటినీ ఒక్కటొక్కటిగా విశాఖపట్నానికి తరలించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య తాజాగా ఈ జీవో వెలువడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విశాఖ మెట్రో కోసం ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామనే పేరుతో ప్రభుత్వం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ కార్యకలాపాలన్నింటినీ కూడా విశాఖకే తరలించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతున్నాయి కూడా.