జనసేన కొలాటెరల్ డ్యామేజ్ - టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానానికి ఎసరు..!!
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ క్రమంగా తన పట్టును పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. పట్టణ ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టిని కేంద్రీకరించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకును కొల్లగొట్టాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తోందా పార్టీ. వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకీ నష్టాన్ని కలిగించే వ్యూహాలను పన్నుతోన్నట్లు తెలుస్తోంది.
పట్టణ ప్రాంతాలపై..
ప్రస్తుతం జనసే.. భారతీయ జనత పార్టీతో పొత్తులో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రలో బీజేపీకీ చెప్పుకోదగ్గ స్థాయిలో పట్టు ఉంది. ప్రత్యేకించి- ఉమ్మడి విశాఖపట్నం జిల్లా బీజేపీకి పెట్టని కోట. గతంలో విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని గెలుచుకున్న కెపాసిటీకీ బీజేపీకి ఉంది. ఎమ్మెల్సీ మాధవ్ ఈ ప్రాంతానికి చెందిన నాయకుడే. పట్టణ ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాలు, విద్యాధికులు భారీ సంఖ్యలో బీజేపీకి మద్దతు ఇస్తోన్నారిక్కడ.
మరింత బలోపేతం..
దీన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉంది జనసేన. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే నియోజకవర్గాలపై సైతం దృష్టి సారించినట్టే కనిపిస్తోంది. విశాఖపట్నం సిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభంజనం వీచినప్పటికీ- విశాఖలో ఆ స్థాయిలో ప్రభావాన్ని కనపర్చలేదు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాలుగు స్థానాలను కూడా టీడీపీ గెలుచుకుంది.
టీడీపీ హ్యాట్రిక్..
ఇందులో ఒకటి- విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం. వరుసగా మూడుసార్లు టీడీపీ జెండా ఎగిరిన స్థానం. వెలగపూడి రామకృష్ణ బాబు అప్రహతంగా విజయాన్ని అందుకుంటోన్నారు.. 2009 నుంచీ. ఆయనకు ఓటమి అనేదే లేకుండా పోయిందిక్కడ. 2019 ఎన్నికల్లో 26 వేలకు పైగా భారీ మెజారిటీతో టీడీపీ గెలిచిన స్థానాల్లో ఇదీ ఒకటి. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు తరువాత ఆ స్థాయిలో టీడీపీకి మెజారిటీని అందించారు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఓటర్లు.
జనసేన కన్ను..
దీనిపై జనసేన పార్టీ కన్ను పడింది. 2024 ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తోంది. అభ్యర్థిని సైతం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు పార్టీ నాయకులు. జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ను ఇక్కడి నుంచి బరిలోకి దింపడం ఖాయమనే అంటున్నారు. మూర్తి యాదవ్కు ఉన్న ఫాలోయింగ్ను పరిగణనలోకి తీసుకుంటే ఆయన విజయం సాధిస్తారనే ధీమా జనసేన వర్గాల్లో వ్యక్తమౌతోంది.
పొత్తు లేకపోతే..
టీడీపీతో జనసేనకు ఎలాంటి పొత్తు లేకపోతే మాత్రం ఈ స్థానాన్ని తాము గెలిచి తీరుతామని చెబుతున్నారు. వెలగపూడి రామకృష్ణ బాబుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని, అంతకుమించి- మూర్తి యాదవ్కు మంచి ఆదరణ ఉందనీ అంచనా వేస్తోన్నట్లు స్పష్టం చేస్తోన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ కూడా తమకే మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున విశాఖ తూర్పు నియోజకవర్గంపై జెండా పాతేస్తామనే ధీమా జనసేన నేతల్లో ఉంది.