మాజీ ఎంపీ సబ్బంహరికి షాక్- విశాఖలో ఇల్లు కూల్చివేస్తున్న జీవీఎంసీ
ఒకప్పుడు వైసీపీలో కీలక నేతగా చెలామణి అయి, ఆ తర్వాత టీడీపీలో చేరి జగన్పై విరుచుకుపడే అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బంహరి ఇప్పుడు అధికార పార్టీకి టార్గెట్ అయినట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సబ్బంహరిని టార్గెట్ చేస్ క్రమంలో జీవీఎంసీ అధికారులు ఆయన ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేయడం కలకలం రేపుతోంది.
ఏపీలో ఏడాదిగా నిశబ్ద యుద్ధం - సైనికులకు సీఎం జగనే స్ఫూర్తి - అందరి చూపు ఇటేనంటోన్న వైసీపీ
నిబంధనల ఉల్లంఘన పేరుతో విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉన్న మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటిని ఇవాళ జీవీఎంసీ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. కూల్చివేతల్లో సబ్బంహరి ఇంటి ప్రహరీగోడతో పాటు సరిహద్దులు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిని మాత్రమే కూల్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. కూల్చితపై స్పందించేందుకు జీవీఎంసీ అధికారులు నిరాకరించారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన ఇంటిలో కూల్చివేతలు చేపట్టడంపై సబ్బంహరి నిరసన తెలిపారు.
Recommended Video
సీతమ్మధారలో సబ్బంహరి ఉంటున్న ఇంటి నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆ మేరకు కూల్చివేతలు చేపట్టి సరిహద్దులను మారుస్తున్నట్లు సమాచారం. దీనిపై సబ్బంహరి స్పందిస్తూ తన ఇంట్లో కూల్చివేతలకు అధికారులను పంపిన వారికి విశాఖలో భవిష్యత్తు ఉండబోదని శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతున్నారని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల మధ్యే ఈ కార్యక్రమం పూర్తయింది. విశాఖ రాజధానిగా మారిన తర్వాత అక్కడి టీడీపీ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్న వైసీపీ... దారికి రాని నేతలను టార్గెట్ చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.