ఫలితాల ఉత్కంఠ: గుండెపోటుతో జనసేన అభ్యర్థిని మృతి: జోరుగా ఫ్యాను గాలి
విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన సత్తాను చాటుతోంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటిదాకా 18 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోగలిగింది. మిగిలిన వాటిల్లోనూ అదే జోరు కనిపిస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వైసీపీదే హవా. మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారంలో ఈ నాలులు మున్సిపాలిటీలను వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ విశాఖ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జనసేన అభ్యర్థిని బోను భారతి మరణించారు. 11వ వార్డు తరఫున ఆమె జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఫలితాలు అంతకంతకూ ఉత్కంఠభరితంగా సాగుతున్నందున ఆందోళనకు గురైన ఆమె మరణించినట్లు తెలుస్తోంది. తెల్లవారు జాము నుంచే ఫలితాల కోసం ఉత్కంఠతగా ఎదురు చూస్తోన్న ఆమె గుండెపోటుకు గురయ్యారని గ్రేటర్ విశాఖ జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు.

కాగా- శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ దాదాపు అన్ని జిల్లాల్లోనై వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతోన్నారు. ప్రకాశం జిల్లాలో మెజారిటీ మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కనిగిరి మున్సిపాలిటీలోని అన్ని వార్డులనూ వైసీపీ గెలుచుకుంది. మార్కాపురం, గిద్దలూరుల్లో అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఏకగ్రీవంగా ముగిసిన నాలుగు మున్సిపాలిటీలను కలుపుకొంటే వైసీపీ జెంగా ఎగురవేసిన పుర సంఘాల సంఖ్య 18కి చేరుకుంది. మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. అందులో నాలుగు ఏకగ్రీవం అయ్యాయి.












Click it and Unblock the Notifications