అయ్యన్న సాక్షిగా..టీడీపీపై నాగబాబు సెటైర్లు: సభకు అడ్డంకులకు ప్రయత్నం: భద్రత విషయంలోనూ..!
ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన విశాఖలో పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. పవన్ తో కలిసి మార్చ్ లో పాల్గొనాలని భావించిన మెగా బ్రదర్ నాగబాబు ప్రయత్నించినా..అక్కడ భారీ జన సందోహం కారణంగా నాగబాబు నేరుగా వేదిక ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన ఇసుక సమస్యను వివరిస్తూ వైసీపీ కంటే టీడీపీ యే నయం అంటూ చెప్పిన ఒక కధ ద్వారా అక్కేడ వేదిక మీద ఉన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సాక్షిగా టీడీపీ మీద సెటైర్లు వేసారు.
ఇదే ప్రసంగంలో పవన్ సైతం పాదయాత్ర చేయగలరని..అయితే ప్రజలు దారి ఇవ్వరంటూ వ్యాఖ్యానించారు. కర్నాటకలో పవన కు అక్కడి పోలీసు అధికారులు 900 మందితో భద్రత ఇస్తే..ఇక్కడ ఇంత పెద్ద మార్చ్ లో మాత్రం ఏపీ ప్రభుత్వం కేవలం 70 మంది పోలీసులను కేటాయించారని వివరించారు. ప్రభుత్వ అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేసినా..పవన్ అనుకున్నది సాధించి తీరతారని నాగబాబు చెప్పుకొచ్చారు.
పవన్ పాదయాత్ర చేయగలడు..ప్రజలు దారి ఇవ్వరు..
విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ లో పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. తాను పవన్ తో కలిసి మార్చ్ లో నడవాలని భావించినా.. అక్కడ తనను నడవీయలేదని చెప్పుకొచ్చారు. ఇసుక సమస్య తమ కొంప ముంచుతుందని వైసీపీ నేతలు అంచనా వేయలేదని వ్యాఖ్యానించారు. ఇసుకే కదా అనుకున్నారు..దాదాపు 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని..ప్రత్యక్షంగా..పరోక్షంగా కోటి మంది పైన ప్రభావం చూపిస్తుందని వివరించారు.
ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది కదా అనే ధీమాతో ప్రభుత్వం ఉందన్నారు. తొలుత ప్రభుత్వానికి ఆరు నెలల నుండి ఏడాది వరకు సమయం ఇవ్వాలని భావించామని..అయితే ప్రభుత్వమే తమను రోడ్డు మీదకు తీసుకొచ్చామని వివరించారు. భవన నిర్మాణ కార్మికులతో ఆడుకుంటున్నారని మండి పడ్డారు.
వైసీపీ కంటే టీడీపీయే బెటర్ అంటూ సెటైర్లు...
నాగబాబు ప్రసంగించే సమయంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వేదిక మీదే ఉన్నారు. నాగబాబు ఓ కధ చెబుతూ కొడుకు కంటే తండ్రి బెటర్ అనిపించుకోవటానికి ఏం చేసారో ఓ కధ చెప్పుకొచ్చారు. ఆ కధలో తండ్రి ఏం చేసారో..ఆ తరువాత కొడుకు ఏం చేసారో చెబుతూ..కొడుకు కంటే తండ్రే బెటర్ అని చెప్పుకొనే పరిస్థితి వివరిస్తూ పరోక్షంగా టీడీపీ విధానాలను సైతం ఆ పార్టీ నేతల ముందే తప్పు బట్టారు.
వైసీపీ కంటే టీడీపీ నే బెటర్ అని చెప్పేందుకు ఆయన చెప్పిన కధతో అయ్యన్న విస్తుపోయారు. తమ పార్టీ నేత తోట చంద్రశేఖర్ ఇసుక సమస్యను పది రోజుల్లో పరిష్కరించటానికి సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ముందుగానే పరిస్థితి అంచనా వేసి ప్రభుత్వంలోని వారు ఇసుకను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వారి తెలివితేటలకు అభినందనలు అంటూ ఎద్దేవా చేసారు.
పవన్ కు భద్రత తగ్గించారంటూ..
విశాఖ కార్యక్రమానికి వచ్చే ముందు కర్నాటకలో ఒక దేవాలయ కార్యక్రమంలో పాల్గొన్నారని..అక్కడ భారీగా అభిమానులు రావటంతో అక్కడి ప్రభుత్వం 900 మంది పోలీసులతో భద్రత కల్పించారని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక, ఇక్కడ ఇంత అభిమానం వెల్లువెత్తుతుంటే కేవలం 70 మంది పోలీసులనే కేటాయించారని వివరించారు. సమావేశం జరగకుండా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారని నాగబాబు ఆరోపించారు. ఇప్పటికే 9 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని..సమస్య పరిష్కారం అయ్యే వరకూ వారికి పది వేలు తగ్గకుండా పరిహారం చెల్లించాలని నాగబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.