"వాల్తేరు వీరయ్య" కు ప్రభుత్వ అనుమతులపై చిరంజీవి వ్యాఖ్యలు..!!
మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కొద్ది గంటల్లో జరగనుంది. ఈవెంట్ నిర్వహణ పైన ముందుగా ఎంపిక చేసిన ప్రాంతంలో అనుమతులు లభించలేదు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 1 అనుగుణంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సినీ నిర్మాతలకు సూచించారు. దీంతో, ముందుగా నిర్ణయించిన వేదిక నుంచి మరో ప్రాంతానికి ఈవెంట్ వేదికను మార్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి విశాఖకు బయల్దేరు. ఈ సమయంలో ఈవెంట్ స్థలం మార్పు..ప్రభుత్వ నిర్ణయాల పైన స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గనేందుకు చిరంజీవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖ బయల్దేరారు. హీరో రవితే కూడా చిరంజీవితో కలిసి విశాఖ బయల్దేరారు. ఈ సమయంలో ప్రభుత్వం తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు..స్థల మార్పిడి పైన చిరంజీవి స్పందించారు.
ఈ వ్యవహారం పైన తాను స్పందించనని తొలుత చెప్పిన చిరంజీవి.. అక్కడి పరిస్థితులకు అనుగుణం అధికారులు నిర్ణయం తీసుకుంటారని పరోక్షంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. ఈ వేడుక తొలుత విశాఖలోని ఆర్కే బీచ్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. అయితే, స్థానిక అధికారులు ఈ మెగా ఈవెంట్ ను ఆర్కే బీచ్ లో కాకుండా.. ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించుకోవాలని సూచించారు.
దీంతో అక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేసారు. సంక్రాంతి రేసులో దూసుకొస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొల్గొనేందుకు చిరంజీవి వస్తుండటంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వస్తున్నారు. విశాఖ కేంద్రంగా చాలా కాలం తరువాత చిరంజీవి సినిమా ఫంక్షన్ జరుగుతోంది. అందునా వాల్తేరు వీరయ్య సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కూడా ట్రెండింగ్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయిన బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అభిమానుల ముందుకు రాబోతోంది.. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక మెగా అభిమాని మెగాస్టార్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య ఆలా ఉంటుందని చెబుతూ దర్శకుడు బాబి మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేసారు.