రగిలిన ఉత్తరాంధ్ర: విశాఖ పరిపాలన రాజధాని కోసం డిమాండ్: భారీ ర్యాలీకి
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లులను జగన్ సర్కార్ ఉపసంహరించుకోవడంతో ఉత్తరాంధ్రలో ప్రజా ఉద్యమం పురుడు పోసుకునేలా కనిపిస్తోంది. సాగరనగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించాలంటూ ఈ ప్రాంత ప్రజలు ప్రదర్శనలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. పరిపాలన రాజధానిగా బదలాయించడానికి విశాఖపట్నానికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రాంత ప్రజల అకాంక్షలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోన్నారు.
Recommended Video

మెరుగైన బిల్లు కోసం..
అమరావతిని కొనసాగిస్తూనే.. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వివిధ కారణాలతో దీన్ని ఉపసంహరించుకుంటున్నామని, మళ్లీ సమగ్రమైన, మరింత మెరుగైన బిల్లును తీసుకుని వస్తామంటూ వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. విస్తృత, విశాలు, మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రయోజనాల కోసం మరో బిల్లును తీసుకొస్తామని స్పష్టం చేశారు.

హైకోర్టుకూ స్పష్టీకరణ..
మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఉద్దేశించిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకోనున్నట్లు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకు స్పష్టం చేశారు. ఈ బిల్లులకు సంబంధించిన పిటీషన్లపై విచారణ కొనసాగిస్తోన్న ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ తరువాత కొద్దిసేపటికే అసెంబ్లీలో ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. బిల్లులను ఉపసంహించుకోవడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తరువాత ఆమోదించారు.

ఉత్తరాంధ్రలో గందరగోళం..
ఈ పరిణామాలతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారుతుందంటూ ఆశించిన ఈ ప్రాంత ప్రజలు- ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళనకు గురయ్యారు. మరింత మెరుగైన బిల్లులను తీసుకొస్తామంటూ చేసిన హామీని వైఎస్ జగన్ వీలైనంత త్వరగా అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా బదలాయించాలనే తమ అకాంక్షలను తెలియజేయడానికి సన్నాహాలు చేస్తోన్నారు. ఇందులో భాగంగా- విశాఖలో భారీ ర్యాలీని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ర్యాలీకి సన్నాహాలు..
ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధుల ఆధ్వర్యలో ఈ ర్యాలీ ఏర్పాటు కానుంది. ద్వారకా నగర్లోని రామా పిక్చర్ ప్యాలెస్ నుంచి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. విశాఖను పరిపాలన రాజధానిగా బదలాయించాల్సిందేనని, వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీని వీలైనంత త్వరగా నెరవేర్చాలనే డిమాండ్తో ప్రజా సంఘాల జేఏసీ నాయకులు, ప్రతినిధులు దీన్ని నిర్వహించనున్నారు. సూపర్ కేపిటల్ అనే కాన్సెప్ట్ ఏ మాత్రం మంచిది కాదంటూ నినదిస్తున్నారు. రాజధానిగా అవతరించడానికి అవసరమైన అన్ని అర్హతలు విశాఖపట్నానికి ఉన్నాయని స్పష్టం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications