వీడియో: ఏం పిల్లడో ఎళ్దామొస్తవ - జగన్ నోట వంగపండు పాట..!!
విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కొన్నింటిని ప్రారంభించారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు. వీటి మొత్తం విలువ 10,500 కోట్ల రూపాయలు. విశాఖపట్నం చేపలరేవు ఆధునికీకరణ, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఆరులేన్ల జాతీయ రహదారి పనులు, పోర్ట్ కనెక్టివిటీ కోసం అదనంగా నాలుగు లేన్ల డెడికేటెడ్ పోర్ట్ రోడ్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన- గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల నుంచీ పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సభా ప్రాంగణం కిటకిటలాడింది. భారతీయ జనత పార్టీ రాష్ట్రశాఖ నాయకులు, కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు.
తొలుత- ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి ప్రాజెక్టుల నమూనాలను ప్రధాని పరిశీలించారు. అనంతరం వేదికపైకి చేరుకున్నారు. వైఎస్ జగన్ ఆయనను శాలువ కప్పి సన్మానించారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని జ్ఞాపికగా అందించారు. అశ్విని వైష్ణవ్ ప్రసంగంతో ఈ సభ ఆరంభమైంది. రాష్ట్రానికి మంజూరు చేసిన ప్రాజెక్టులు, వాటి వివరాలను ఆయన వెల్లడించారు. ఏపీ పురోభివృద్ధికి ఇవి దోహదపడతాయని వ్యాఖ్యానించారు.
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. మోదీ సభకు ఉత్తరాంధ్ర ప్రజానీకం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరాంధ్రకే చెందిన ప్రజా కవి, దివంగత వంగపండు ప్రసాద రావును గుర్తు చేసుకున్నారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తూ ఉంటే వంగపండు మాటలు గుర్తుకొస్తోన్నాయని అన్నారు.
వీడియో: ఏం పిల్లడో ఎళ్దామొస్తవ - జగన్ నోట వంగపండు పాట..!!#NarendraModi, #Visakhaptanm, #YSJagan pic.twitter.com/VGkC0Vw96d
— oneindiatelugu (@oneindiatelugu) November 12, 2022
వంగపండు పాడినట్టుగా ఏం పిల్లడో ఎళ్దమొస్తవ.. అంటూ ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం.. ప్రభంజనంలో కదిలి వచ్చారని చెప్పారు. ఈ ప్రాంతానికే చెందిన విప్లవ రచయిత శ్రీశ్రీనీ వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. శ్రీశ్రీ చెప్పినట్టు- వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్.. అన్నట్లుగా సభకు ప్రజలు హాజరయ్యారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి ఉన్న అనుబంధం గురించి వైఎస్ జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.