డోలీలో గర్భిణీని 10 కిలోమీటర్ల తీసుకెళ్లారు: విశాఖ మన్యంలో తీరని కష్టాలు
విశాఖపట్నం: ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. వారే విశాఖ మన్యంలో ఉండే ప్రజలు. మన్యంలోకి ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో ఎవరు అస్వస్థతకు గురైన ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ డోలీలో ఆస్పత్రులకు వెళ్లాల్సిందే. తాజాగా, అలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది.
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని జీ మాడుగుల మండలం సరిహద్దు తల్లాబులో రాములమ్మ అనే నిండు గర్భిణికి శనివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి స్థానికులు డోలీనే అనుసరించారు.
కొండల మధ్య సుమారు 10 కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుని మద్ది గరువు రహదారి మార్గానికి చేరుకున్నారు. అయితే, రహదారి వద్దకు సమయానికి అంబులెన్స్ కూడా రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
స్పందించిన సీఐ దేవుడు బాబు, ఎస్సై ఉపేంద్రలు హుటాహుటిన అంబులెన్స్ పంపించారు. అనంతరం గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో రహదారులు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తమకు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు.