ఇక జెట్ స్పీడ్: పాలనా రాజధానిగా: అదొక్కటే ఆలస్యం: ఆ ముహూర్తమే ఖాయం: త్వరలో అధికారికంగా
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయింది. శాసనపరంగా తలెత్తిన అవాంతరాలన్నీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ఒక్క సంతకం, వేసిన ఒక్క ముద్రతో పటాపంచలు అయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. గవర్నర్ ఆమోదం తెలపడం రాజకీయంగా కూడా కలకలం రేపుతోంది.

షిఫ్టింగ్ పనులు రేపో, మాపో..
వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇక తరలింపు పనులను చేపట్టబోతోంది ప్రభుత్వం. తరలింపులో ఏ మాత్రం జాప్యం చేయకూడదని భావిస్తోంది. కరోనా సంక్షోభ పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ.. పరిపాలనను విశాఖ నుంచే ఆరంభించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అధికారులు రాజధాని తరలింపు పనులను వేగవంతం చేస్తారని అంటున్నారు. రేపో, మాపో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమౌతాయనీ చెబుతున్నారు.

దసరా నాటికి షిఫ్టింగ్ కంప్లీట్ అయ్యేలా..
దసరా పండుగ అక్టోబర్లో రానుంది. ఆ నెల 25 తేదీన విజయదశమి. హిందూ సంప్రదాయాల ప్రకారం.. విజయదశమి నాడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దిగ్విజయమౌతుందనేది నమ్మకం. వైఎస్ జగన్ ఆ ముహూర్తాన్నే ఖాయం చేసుకున్నారని తెలుస్తోంది. వచ్చే దసరా నాటికి విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించడం ఖాయమని అంటున్నారు. దేవీ నవరాత్రులు ఆరంభం అయ్యే సమయానికి విశాఖ నుంచి పూర్తిస్థాయిలో పరిపాలన కొనసాగించవచ్చని సమాచారం. విజయదశమి నాటికల్లా ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నట్లు తెలిపింది.

ఆ ప్రదేశంలోనే సచివాలయం..
భీమిలీ సమీపంలో మూతపడిన పైడా ఇంజినీరింగ్ కళాశాల భవన సముదాయాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చవచ్చంటూ ఇదివరకే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దాదాపుగా ఆ ఇంజినీరింగ్ కళాశాల భవనాన్నే సచివాలయంగా మార్చడానికి వైఎస్ జగన్ సుముఖతను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. విశాఖ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో పైడా గ్రూపునకు చెందిన రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి.

మాజీ ముఖ్యమంత్రి అల్లుడి కళాశాలలో..
పైడా ఇంజినీరింగ్ కాలేజీ కాగా.. మరొకటి కౌశిక్ ఇంజనీరింగ్ కాలేజీ. సుమారుగా 30 ఎకరాల్లో ఇవి ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కే రోశయ్య అల్లుడు పైడా కృష్ణప్రసాద్ చెందిన కళాశాలలు అవి. నాలుగేళ్ల కిందటే కౌశిక్ ఇంజనీరింగ్ కళాశాల మూతపడింది. ప్రస్తుతం పైడా ఇంజినీరింగ్ కళాశాల మాత్రమే నడుస్తోంది. అందులో కూడా రెండేళ్ల నుంచి అడ్మిషన్లను నిలిపివేశారు. వాటిని సచివాలయంగా మార్చుతారని చెబుతున్నారు.
Recommended Video

విశాఖ పోర్ట్ గెస్ట్హౌస్ క్యాంపు కార్యాలయంగా..
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడనేది ఇంకా ఖచ్చితంగా ఖరారు కానప్పటికీ.. విశాఖ పోర్ట్కు చెందిన అతిథిగృహాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇదివరకే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ పోర్ట్ గెస్ట్హౌస్ను కూడా పరిశీలించారు. పోర్ట్ గెస్ట్హౌస్ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. దీనికి వైఎస్ జగన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. అన్నీ కుదురుకున్నాయని, అందుకే రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడంలో ప్రభుత్వం జాప్యం చేయదలచుకోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications