Southwest Monsoon ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? వచ్చే మూడురోజుల అంచనాలివీ: రాయలసీమలో మరిన్ని
విశాఖపట్నం: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జోరందుకుంటోన్నాయి. క్రమంగా విస్తరిస్తోన్నాయి. కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడురోజులకు సంబంధించి వర్ష సూచనలు, హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు తాజాగా జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోవచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Recommended Video
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకిన రుతుపవనాలు.. క్రమంగా విస్తరిస్తోన్నాయి. అవి విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. క్రమంగా కేరళా అంతటా విస్తరించాయని, కర్ణాటక, కోస్తా కర్ణాటక జిల్లాలు, తమిళనాడు దక్షిణ అంతర్గత ప్రాంతాల్లో ప్రవేశించినట్లు తెలిపారు. దీని ప్రభావంతో కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి.

ఆయా రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుల సరిహద్దులకు ఆనుకుని ఉన్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తాయని, దీని ప్రభావం వల్ల వచ్చే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే మూడురోజుల్లో ఈ రుతుపవనాలు తెలంగాణ దక్షిణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.
ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి బలహీన పడినట్లు చెప్పారు. ఈ రెండూ బలహీన పడటం కూడా రుతుపవనాలు విస్తరించడానికి కారణమౌతున్నట్లు తెలిపారు. ఫలితంగా- వచ్చే మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4,5,6 తేదీల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications