విశాఖపట్నంలో కలకలం- వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లు- పగిలిన అద్దాలు
విశాఖపట్నం: విశాఖపట్నంలో కలకలం చోటు చేసుకుంది. రాష్ట్రానికి వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎక్స్ప్రెస్ కోచ్ అద్దాలు పగిలాయి. మెయింటెనెన్స్ కోసం ఈ రైలును తీసుకెళ్తోన్న సమయంలో కంచరపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు.
ఏపీ వేరే రాష్ట్రం- నాకు అక్కడ ఓటు హక్కు కూడా లేదు: మెగాస్టార్ సంచలనం
వాయిదా..
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం- వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్లో జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. ఇది తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నెలాఖరులో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 27 లేదా 28వ తేదీన ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.
మెయింటెనెన్స్ కోసం..
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టాల్సిన ఎక్స్ప్రెస్ ఇది. ప్రధాని కార్యక్రమం వాయిదా పడినప్పటికీ- ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ కావడం వల్ల దానికి అనుగుణంగానే వందేభారత్ ఎక్స్ప్రెస్.. ఇవ్వాళ విశాఖపట్నానికి చేరుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడటం వల్ల ఈ రైలును మెయింటెనెన్స్ కోసం షెడ్ కు తరలించారు అధికారులు. కంచరపాలెం మీదుగా వెళ్తోన్న సమయంలో అనూహ్యంగా రాళ్లు విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలో ఎక్స్ప్రెస్ కిటికీ అద్దాలు పగిలాయి.
విచారణకు ఆదేశం..
సమాచారం అందిన వెంటనే విశాఖపట్నం డివిజినల్ రైల్వే మేనేజర్.. ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జనరల్ రైల్వే పోలీస్ అధికారులు రైలును పరిశీలించారు. ఎక్కడి నుంచి రాళ్లు పడ్డాయనే విషయంపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఉద్దేశపూరకంగా రాళ్లు విసిరారా? లేక యాదృచ్ఛికంగా ఈ ఘటన సంభవించిందా? అనేది ఆరా తీస్తోన్నారు.
చాలా చోట్ల..
వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులపై వేర్వేరు రాష్ట్రాల్లో రాళ్ల దాడులు చోటు చేసుకున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లల్లో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆయా చోట్ల ఈ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కిన తరువాత ఇలాంటి దాడులు జరిగాయి. ఇక్కడ మాత్రం ఇంకా ప్రారంభానికి నోచుకోకముందే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
Andhra Pradesh | Stones pelted on Vande Bharat train in Visakhapatnam which will be flagged off by PM Modi on Jan 19. Incident occurred during maintenance.
— ANI (ANI) January 11, 2023
Glass pane of a coach of Vande Bharat express was damaged near Kancharapalem, Visakhapatnam. Further probe underway: DRM pic.twitter.com/JQLrHbwyJ4
ఎనిమిదో రైలు..
వందేభారత్ సిరీస్ లో ఇది ఎనిమిదవ ఎక్స్ ప్రెస్. మొన్నీ మధ్యే వర్చువల్ గా ఏడవ వందేభారత్ రైలును మోదీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి న్యూ జల్పాయ్గురి మధ్య ఈ రైలు పరుగులు తీస్తోంది. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టదలిచిన వందేభారత్ ఎనిమిదవ ఎక్స్ప్రెస్ ఇది. రద్దీతో కూడుకుని ఉన్న ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు ఇదివరకే ప్రతిపాదనలను పంపించారు. వాటిని రైల్వేబోర్డు ఆమోదించింది.