ఉత్తరాంధ్ర నడిబొడ్డున చంద్రబాబు పర్యటన: అమరావతికే జై కొడతారా? విశాఖపై వైఖరేంటీ?
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇదివరకే ఆయన పలుమార్లు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించాలని షెడ్యూల్ను రూపొందించుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా బదలాయించడాన్ని ముందు నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న చంద్రబాబు.. అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటించడానికి పూనుకోవడం ఆసక్తి రేపుతోంది.

అమరావతికి జై కొట్టగలరా?
రాష్ష్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తోన్న పథకాలు, ఇతర కార్యక్రమాల పట్ల వరుసబెట్టి వ్యతిరేకిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని అటు తెలుగుదేశం పార్టీ గానీ, ఇటు చంద్రబాబు గానీ ఏ రేంజ్లో వ్యతిరేకిస్తున్నారో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. సుమారు 50 రోజుల వరకూ అమరావతి రైతులు, అమరావతి పరిరక్షణ కమిటీలు నిర్వహించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుండి మరీ నడిపించారు.

విశాఖను రాజధానిగా కాదనగలరా?
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు విజయనగరం పర్యటనకు బయలుదేరి వెళ్లబోతుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి నడిబొడ్డుగా చెప్పుకొనే విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. విశాఖపట్నాన్ని రాష్ట్ర పరిపాలనా రాజధానిగా బదలాయించడం పట్ల చంద్రబాబు తన వైఖరేమిటో స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా ఆయనకు ఎదురు కావచ్చు. ఈ గండం నుంచి ఆయన ఎలా గట్టెక్కగలరనేది చర్చనీయాంశమైంది.

చంద్రబాబు పర్యటన సాగేది ఇలా..
విజయనగరం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించే అవకాశం ఉందని ప్రాథమికంగా తెలుస్తోంది. విజయనగరంతో పాటు శృంగవరపు కోట, గజపతి నగరంలల్లో ఆయన ప్రజా చైతన్య యాత్రలను నిర్వహిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రూట్ మ్యాప్కు ఇంకా చంద్రబాబు ఖరారు చేయాల్సి ఉందని అంటున్నారు. తన పర్యటన సందర్భంగా రోడ్ షో, బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Recommended Video


మూడు రాజధానుల అంశాన్ని ఎత్తొద్దంటూ..
ఇదిలావుండగా- చంద్రబాబు తన పర్యటన సందర్భంగా ఎక్కడే గానీ.. మూడు రాజధానుల ప్రస్తావన అంశాన్ని తీసుకుని రాకపోవచ్చని జిల్లా నాయకులు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వ పనితీరును లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. మూడు రాజధానుల అంశాన్ని ఎక్కడా ఎత్తకూడదంటూ ఇదివరకే పార్టీ అగ్ర నాయకత్వం నుంచి జిల్లా నాయకులకు సందేశాలు వెళ్లాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications