గంటాకు ఎసరు: పొమ్మనలేక పొగ: ఓటమికి ఆయనే బాధ్యుడు: చంద్రబాబుకు విశాఖ నేతల ఘాటు లేఖ
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి.. సరికొత్త సమీకరణాలకు దారి తీసేలా కనిపిస్తోంది. విశాఖపట్నం నగరంపై గట్టి పట్టు ఉన్నప్పటికీ.. అది సడలిపోవడానికి కారణాలను అన్వేషిస్తోంది. అన్ని స్థాయిల్లో పార్టీ నగర నాయకులు విఫలం కావడం.. వారికి సరైన నాయకత్వం లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్లో జోష్ నింపే నేతలు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంచనా వేస్తోన్నారు. ప్రత్యేకించి- విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గంటా శ్రీనివాస్ వైఖరి దెబ్బకొట్టిందని భావిస్తున్నారు.
టీడీపీ ఆధిపత్యానికి చెక్..
విశాఖ నగర రాజకీయాలపై టీడీపీకి ఆధిపత్యం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించినప్పటికీ.. విశాఖలో ప్రతికూల ఫలితాలను చవి చూసింది. గ్రేటర్ విశాఖ పరిధిలో నాలుగు నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకోగలిగింది. విశాఖ నార్త్ నుంచి గంటా శ్రీనివాస రావు, వెస్ట్ నుంచి పీజీవీఆర్ నాయుడు (గణబాబు), సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ తరఫున విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరారు.
జీవీఎంసీ ఎన్నికల నాటికి బలహీనం..
సాధారణ ఎన్నికలు ముగిసిన ఈ 22 నెలల వ్యవధిలో విశాఖ నగర రాజకీయాలపై టీడీపీ తన పట్టును కోల్పోయింది. గ్రేటర్ విశాఖ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనంగా తీసుకోవచ్చు. విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకోగలిగింది. టీడీపీ 40 డివిజన్లను కూడా గెలుచుకోలేకపోయింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రచారానికి వచ్చినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు.
స్థానిక నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అంతర్గత విభేదాలు, నేతల మధ్య కుమ్ములాటలు, ప్రత్యేకించి- గంటా శ్రీనివాస రావు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోకపోవడం ప్రధాన కారణమని తేల్చారు.
గంటాను సాగనంపండి..
ఈ పరిస్థితుల మధ్య గంటా శ్రీనివాస రావు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోన్నారు. ఆయన వైఖరి వల్ల పార్టీ గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిందని, ఆయనను వెంటనే సాగనంపాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు విశాఖ టీడీపీ నగర అధ్యక్షుడు పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.
ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఈస్ట్ నియోజకవర్గంలోనే మెజారిటీ డివిజన్లను కోల్పోయామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడానికి గంటాను బాధ్యుడిగా గుర్తించామని స్పష్టం చేశారు. మరికొంతకాలం ఆయన పార్టీలో కొనసాగితే.. మరింత దిగజారడం ఖాయమనే ఆందోళనను వ్యక్తం చేశారు.
ఆ ఏడు కార్పొరేటర్ల మాటేంటీ..
ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మేయర్ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ సహా ఏడుమంది కార్పొరేటర్లు వైసీపీకి చెందిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలుసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. పులి లక్ష్మీబాయి, గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాస రావు, లేళ్ల కోటేశ్వరరావు, బొండా జగన్నాథం, మొళ్లి ముత్యాలు ఎమ్మెల్యేను కలిశారు.
దీనిపై విశాఖ టీడీపీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ వారికి షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే ఈ సారి ఏకంగా గంటా శ్రీనివాస్ను టార్గెట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.