విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ప్రభుత్వంపై భగ్గుమంటున్న గ్రామస్తులు...
విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు మంగళవారం(మే 19) ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం,అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ ఈ సందర్భంగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనతో ఎక్కువగా ప్రభావితమైన తమ గ్రామాన్ని వదిలేసి.. మంత్రులు,కమిటీలు పక్కన గ్రామాల్లో సభలు,సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

తమను పట్టించుకోవట్లేదని ఆవేదన..
మంగళవారం మంత్రి అవంతి శ్రీనివాస్ వెంకటాపురంకు కొద్ది దూరంలోని కంపర అనే గ్రామంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడాన్ని వారు తప్పు పట్టారు. తమ గ్రామాన్ని విడిచిపెట్టి పక్కన గ్రామాల్లో చెక్కుల పంపిణీ చేయడమేంటని నిలదీశారు. ఏ కార్యక్రమమైన పొరుగు గ్రామాల్లోనే చేస్తున్నారని.. తమనెందుకు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇప్పటివరకూ తమకెలాంటి వసతులు కల్పించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లోనూ పొరుగు గ్రామాలకు చెందినవారినే మాట్లాడించారని.. తమ గ్రామానికి చెందిన ఒక్కరితోనూ మాట్లాడించలేదని అన్నారు.

స్పెషలిస్ట్ వైద్యులు లేరని ఆరోపణలు..
డబ్బులు ఇచ్చారు తప్పితే.. తమ ఆరోగ్యాల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శ్వాసకోశ నిపుణులైన వైద్యులను 24 గంటలు గ్రామంలో అందుబాటులో ఉంచుతామని చెప్పి.. కేవలం సాధారణ నర్సులనే పెట్టారని ఆరోపించారు. తమ గ్రామాల్లోనే ఓ ఆసుపత్రి కూడా నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. హెల్త్ కార్డులు కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు.
గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ మెయిన్ గేటు ముందు గుమిగూడిన గ్రామస్తులకు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
Recommended Video

గ్రామాన్ని విడిచిన 15 కుటుంబాలు..
గ్యాస్ లీకేజీ తర్వాత వెంకటాపురం గ్రామాన్ని విడిచి వెళ్లిన కుటుంబాల్లో ఇప్పటివరకూ 15 కుటుంబాలు ఇంకా గ్రామానికి తిరిగి రాలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. అయితే అనధికారంగా ఆ సంఖ్య 50 వరకు ఉండవచ్చునన్న వాదన కూడా వినిపిస్తోంది. కాగా,విశాఖపట్నంలో మే 7 తెల్లవారుజామున జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 500 పైచిలుకు మంది అస్వస్థతకు గురయ్యారు.ఈ ఘటనకు సంబంధించి బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే నష్ట పరిహారం చెల్లించింది. ప్రమాదానికి కారణమైన ఫ్యాక్టరీపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. అయితే నష్టపరిహారం మాత్రమే సరిపోదని.. ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాల్సిందేనని వెంకటాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications