వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పేలుడు - ఉలిక్కి పడ్డ విశాఖపట్నం
విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందనే విషయం తెలిసి విశాఖవాసులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఆవరణలో మెయింటెనెన్స్ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. సాధారణంగా స్టీల్ ప్లాంట్లో తరచూ నిర్వహణ పనులను చేపడుతుంటారు ఉద్యోగులు. ఒక్కో విభాగంలో ఒక్కో దశలో ఈ మెయింటెనెన్స్ వర్క్స్ను చేపడుతుంటారు. ఇవ్వాళ కూడా యధావిధిగా నిర్వహణ పనులను చేపట్టారు.
ఈ పనులు కొనసాగుతున్న సమయంలో ఉక్కు ఫ్యాక్టరీలోని నంబర్ 11 డిపార్ట్మెంట్లో తారు ట్యాంక్లో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దం వెలువడింది. తారు మొత్తం బయటికి ఎగజిమ్మింది. ఈ ఘటనలో అక్కడే నిర్వహణ పనుల్లో నిమగ్నమై ఉన్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
పేలుడు తరువాత మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణమే నివారణ చర్యలను తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. వారిలో జీ నగేష్ అనే కార్మికుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ముగ్గురికీ ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.