మరోసారి వార్తల్లోకి ఎక్కిన పీపుల్స్ స్టార్: వైసీపీ ఎంపీతో కీలక భేటీ: జగన్ రాకకు ముందే విశాఖలో.. !
విశాఖపట్నం: ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విప్లవ చిత్రాల కథనాయకుడిగా, పీపుల్స్ స్టార్ గా గుర్తింపు పొందారు. చిత్ర పరిశ్రమలో వామపక్ష భావజాలం కలిగిన ఏకైక నటుడు ఆయన గురువారం ఉదయం హఠాత్తుగా విశాఖపట్నంలో కనిపించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విశాఖ లోక్ సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణను ఆయన నివాసంలో కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు.

జగన్ పర్యటనకు రెండు రోజుల ముందే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు రెండు రోజుల ముందే ఆర్ నారాయణమూర్తి విశాఖపట్నానికి రావడం, వైఎస్ఆర్సీపీ ఎంపీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంవీవీ సత్యనారాయణను కలుసుకోవడానికి రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదని ఆర్ నారాయణమూర్తి వెల్లడించారు. అయినప్పటికీ.. వదంతులకు మాత్రం పుల్ స్టాప్ పడట్లేదు.

జగన్ నిర్ణయాలను స్వాగతిస్తూ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ఈ మధ్యకాలంలో తరచూ ప్రశంసిస్తూ వస్తున్నారు. ఫిరాయింపు రాజకీయాలు మొదలుకుని మూడు రాజధానుల నిర్ణయాల వరకూ చాలా అంశాల్లో నారాయణ మూర్తి తనదైన శైలిలో స్పందించారు. వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారని, దేశానికే ఆదర్శంగా నిలిచారని పలు సందర్భాల్లో ప్రశంసించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ తమ పదవులకు రాజీనామాలు చేసిన తరువాతే వారిని చేర్చుకుంటామంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటనను అప్పట్లో ఆర్ నారాయణమూర్తి స్వాగతించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనపైనా..
ఆ తరువాత- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను కొనసాగించానే నిర్ణయం పట్లా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ పేద, దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన వారని, ఆంగ్ల భాషలో ప్రాథమిక విద్యను అభ్యసించడం వల్ల వారందరికీ ఉన్నత విద్యకు బాటలు వేసినట్టయిందని చెప్పుకొచ్చారు. తాజాగా- మూడు రాజధానుల ప్రకటన పట్ల కూడా ఆర్ నారాయణమూర్తి సానుకూలంగా స్పందించారు.

విప్లవాత్మక నిర్ణయమంటూ..
ఏపీ చరిత్రలో ఇదొక విప్లవాత్మక నిర్ణయమని, అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్రలో రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల వలసలు తగ్గిపోతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసినట్టయిందని ప్రశంసించారు. వలసలకు ఉత్తరాంధ్ర కేరాఫ్ గా మారిందని, ఉపాధి అవకాశాలను వెదుక్కుంటూ ఉత్తరాంధ్రవాసులు ఇతర రాష్ట్రాలు, దేశాలకూ వలస వెళ్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల వలసలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications