విశాఖ క్యాపిటల్కు లీగల్ చిక్కులు.. విజయసాయి ఆందోళన.. బాబు పక్కా ప్లాన్
రాజధాని విషయంలో జగన్ సర్కారుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వబోతున్నారా? రాజధాని అమరావతిలోనే ఉండాలని పట్టుపడుతోన్న టీడీపీ అధినేత.. న్యాయవ్యవస్థ ద్వారా 'విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన'ను అడ్డుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రకమైన భయాందోళన వ్యక్తం చేసింది ఎవరోకాదు.. సీఎం జగన్ కుడిభుజం, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డే. సీఎం విశాఖ పర్యటన నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు కొత్త చర్చకు తెరలేపాయి
జగన్వి పిల్ల చేష్టలు: కేంద్రం హెచ్చరించినా:రాజధాని అమరావతిలోనే ఉండాలి: కన్నా..!
కొత్త రాజధానికి ‘కోర్టు’చిక్కులు?
‘‘నేను ఇంతకుముందు చెప్పినట్లే.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. తనకు అనుకూలమైన కొందరు వ్యక్తుల ద్వారా న్యాయపరమైన అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయవ్యవస్థను అడ్డంపెట్టుకుని ప్రజలకు ద్రోహం తలపెట్టేపనికి పూనుకున్నారు. ఆయనతోపాటు కొందరు వ్యక్తుల ప్రమేయంతో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతోంది''అని ఎంపీ విజయసాయి ఆరోపించారు. అయితే కోర్టు చిక్కులు ఎదురయ్యేంత ఇబ్బందులు ఏమున్నాయో, దానికి సంబంధించిన వివరాల్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు.
ఇదీ చంద్రబాబు ప్లాన్...
స్వలాభం కోసమే చంద్రబాబు విశాఖ క్యాపిటల్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విజయసాయి.. ‘‘అమరావతి, దాని చుట్టుపక్కల వేల ఎకరాల భూముల్ని కొని.. వాటిని లాభానికి అమ్మేసుకుని.. వచ్చిన డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కూడబెట్టాలన్నది చంద్రబాబు, ఆయన కొడుకు పప్పునాయుడి ప్లాన్'' అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అందరు వ్యక్తులకూ మంచి జరగాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని ప్రకటించబోతున్నదని, ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చాలన్న టార్గెట్ తోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆయనకు ప్రజలే గట్టిగా బుద్ధిచెబుతారని విజయసాయి అన్నారు.
మీరేమైనా పత్తిగింజలా.. అయితే ఒప్పుకోండి..
ఇన్ సైడర్ ట్రేడింగ్ పై మంత్రుల కమిటీ నివేదిక వెల్లడికావడం, అమరావతి చుట్టుపక్కల వేలాది ఎకరాల్ని టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడిన నేపథ్యంలో ట్విటర్ వేదికగా ఎంపీ విజయసాయి.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ‘‘అప్పట్లో మీరు మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎందుకెత్తారో ఢిల్లీ మీడియాకు అర్థంకాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని ఇప్పుడు తెలిసొచ్చింది. జనం సొమ్ముతో దేశాలు తిరిగొచ్చారు. నిజంగా పెట్టుబడుల కోసమే అయ్యుంటే.. వెనకబడిన జిల్లాల గురించి ఎందుకు ప్రస్తావించలేదు? మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదు.. ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములు కొన్నాం అని ఒప్పుకోండి''అంటూ విజయసాయి చురకలేశారు.