విశాఖలో భారతరత్నకు అవమానం : ప్రణబ్ కు విద్యుత్..నీళ్లు లేకుండా : ఫైరింజన్ తో నీరిస్తారా..!!
భారతరత్న..మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాజీ రాష్ట్రపతికి ఇదేన అధికారులు ఇచ్చే మర్యాద. విశాఖలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రణబ్ కు అధికారులు కనీసం నీరు కూడా ఇవ్వలేకపోయారు. ఫైరింజన్ ద్వారా మాజీ రాష్ట్రపతికి నీరు ఇచ్చేందుకు ప్రయత్నించి..పరువు తీసుకున్నారు. ఆ నీటిని వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ స్వయం గా ప్రణబ్ అభ్యంతరం వ్యక్తం చేయటంతొ..బయట నుండి బక్కెట్లలో తీసుకొచ్చి అందించారు. దీని పైన ప్రణబ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

ప్రణబ్ కు ఇచ్చే మర్యాద ఇదేనా..
విశాఖలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ముఖర్జీ శనివారం మధ్యాహ్నం నగరానికి విచ్చేశారు. ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ నిర్వహించగా.. పోర్టు గెస్ట్ హౌస్లో బస, వసతి ఏర్పాట్లను మాత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ అధికారులు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా వ్యవహరించిన మహోన్నత వ్యక్తికి బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు.. ముందస్తుగా చెక్ చేసుకోవడం, ట్రయల్ నిర్వహించడం చేయాలి. కానీ.. అవేమీ చూడకుండా పోర్టు అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు . ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్లో చుక్కనీరు కూడా రాకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ప్రణబ్ ఉన్న గదికి పూర్తిగా నీటిసరఫరా నిలిచిపోయింది. ఆలస్యంగా విషయం తెలుసుకొని మేల్కొన్న అధికారులు తరువాత పరుగులు తీశారు. ప్రోటోకాల్ లో ఉన్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అధికారుల నిర్లక్ష్యమే కారణం..
ప్రణబ్ ముఖర్జీ ఎక్కడ బస చేస్తారనేది ముందుగానే అధికారులకు సమాచారం ఉంది. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాల్సిన పోర్టు అధికారులు హడావుడి చేశారే తప్ప ప్రణబ్కు అందించాల్సిన సౌకర్యాల్ని మాత్రం గాలికొదిలేశారు. గెస్ట్ హౌస్లో నీటి సరఫరా బంద్ అవ్వడంతో ఏంచేయాలో పాలుపోని అధికారులు కాన్వాయ్లో ఉన్న అగ్నిమాపక శకటం నుంచి నీరు కావాలని అధికారులు కోరారు. అగ్నిమాపక శకటాల గొట్టాల ద్వారా గెస్టు హౌస్లోని వాటర్ ట్యాంక్లోకి నీటిని మళ్లించాలని భావించారు. అయితే ఈ నీటితో స్నానం చేయడం మంచిది కాదని కొంతమంది సూచించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో కింద నుంచి నీటిని బక్కెట్లతో తెచ్చి స్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇంత జరిగినా.. అక్కడ ఉన్న పోర్టు అధికారులు ఎవరూ నీటి సమస్యని సీరియస్గా తీసుకోలేదు. వసతి సౌకర్యాల బాధ్యతలు చూస్తున్న పోర్టు అధికారి బాపిరాజు నీటి సరఫరా ఎలా పునరుద్ధరించాలన్న విషయాన్ని పక్కనపెట్టి.. వస్తున్న సందర్శకులపై విరుచుకుపడుతూ.. చిందులేశారు. ఇంత సీరియస్ సమస్య ఉన్నప్పటికీ.. పోర్టు ఉన్నతాధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ప్రణబ్ అసహనం..అధికారుల వివరణ..
తనను ఇబ్బంది పెట్టిన తీరు పైన ప్రణబ్ అసహనం వ్యక్తం చేసారు. దీనికి కారణాల పైన ఆరా తీసారు. నీటిని గెస్ట్ హౌస్ ట్యాంకుల్లో నింపేందుకు ఉపయోగించే మోటరు కాలిపోయింది. అయినా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యలేదు. జనరేటర్ ద్వారా చేద్దామని కొందరు సలహా ఇచ్చారు. అయితే ఆ జనరేటర్ కూడా పనిచెయ్యడం లేదని అప్పుడు గుర్తించడంతో ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రొటోకాల్లో భాగంగా గెస్ట్ హౌస్కి వచ్చిన పోర్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ ఈ విషయం తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సమస్య తలెత్తినప్పుడు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. భారతరత్నకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ సిబ్బందిపై మండిపడ్డారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ చైర్మన్ హరనాథ్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications