విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళనలు ఉధృతం .. మెరుపు సమ్మెకు సిద్ధం, ఈ నెల 20న ఉక్కు కార్మిక గర్జన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కొనసాగుతున్న ఉక్కు ఉద్యమం ఉదృతంగా మారుతుంది. కార్మికుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. వివిధ రూపాలలో కార్మికులు తమ నిరసన తెలియజేస్తున్నారు .తాజాగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం ఎదుట కార్మికులు ధర్నా చేశారు.

ఆందోళనలతో వేడెక్కిన విశాఖ నగరం
అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారుఉక్కు కార్మికులు . విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భారీ నిరసనలు, ఆందోళనలతో విశాఖ నగరం వేడెక్కింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కూర్మన్నపాలెం, గాజువాక ప్రాంతాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలతో రణరంగాన్ని తలపిస్తున్నాయి .

25వ తేదీ తర్వాత ఎప్పుడైనా మెరుపు సమ్మెకు దిగే ఛాన్స్
ప్రైవేటీకరణ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 25వ తేదీన జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఉక్కు కార్మికుల గర్జన పేరుతో స్టీల్ ప్లాంట్ విషయంలో బహిరంగ సభ నిర్వహించాలని, 28వ తేదీన ఢిల్లీ కిసాన్ మోర్చా నాయకులతో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక 25వ తేదీ నుండి ఎప్పుడైనా మెరుపు సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

సాగర తీర నగరంలో హోరెత్తుతున్న ఉక్కు నిరసనలు
ఏది ఏమైనా ధర్నాలు, నిరసనలు, మానవహారాలు, రిలే నిరాహార దీక్షలతో సాగర తీర నగరం విశాఖ ఉక్కు సంకల్పంతో ముందుకు నడుస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.
ఇక కేంద్రం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏ విధంగానూ వెనక్కు తగ్గటం లేదు . స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంద శాతం చేసి తీరుతామని తేల్చి చెప్తుంది . ఎవరు ఎన్ని విజ్ఞప్తులు చేసినా , సీఎం జగన్ స్వయంగా స్టీల్ ప్లాంట్ కోసం లేఖలు రాసినా ఫలితం మాత్రం శూన్యం .












Click it and Unblock the Notifications