పతాక స్థాయికి విశాఖ ఉక్కు ఉద్యమం: 25వ తేదీ తరువాత.. ఏ క్షణమైనా: నోటీస్లో క్లియర్
విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ బారి నుంచి తప్పించడానికి.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి కార్మిక సంఘాలు చేస్తోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనల, రాష్ట్రస్థాయి బంద్.. పెద్దగా ప్రభావాన్ని చూపినట్టు కనిపించట్లేదు. అందుకే- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గబోవట్లేదంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిండు సభలో తేల్చి పారేశారు. అరకొరగా కూడా కేంద్రం పెట్టుబడులను అందులో ఉంచదలచుకోలేదని, నూటికి నూరుశాతం అమ్మేస్తామంటూ కుండబద్దలు కొట్టారు.

25 నుంచి ఏ క్షణమైనా నిరవధిక సమ్మెకు..
మోడీ సర్కార్ వైఖరికి అనుగుణంగా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కూడా వెనక్కి తగ్గట్లేదు. తమ ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇందులో భాగంగా.. ఈ నెల 25వ తేదీ నుంచి ఏ క్షణమైనా నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఈ మేరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు సమ్మె నోటీసును అందజేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఈ మేరకు సీఎండీకి నోటీస్ ఇచ్చారు. ఈ నిరవధిక సమ్మెకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకత్వాన్ని వహిస్తుంది.

ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలంటూ..
పారిశ్రామిక వివాదాల చట్టం-1947కు సబ్ సెక్షన్ (1) కింద కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి తాము ఏ క్షణమైన సమ్మెకు వెళ్తామని తెలిపారు. సమ్మె ప్రతిపాదనలను చేయడానికి గల కారణాలను వారు ఈ నోటీస్లో వివరించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్-విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ)ను ప్రైవేటీకరించడానికి ఈ నెల 27వ తేదీన ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రివర్గ ఉప కమిటీ ఇచ్చిన సిఫారసులు, జారీ చేసిన అనుమతులను ఉపసంహరించుకోవాలనేది ప్రధాన డిమాండ్గా పేర్కొన్నారు.

శాశ్వత ఉద్యోగాల కల్పన..
వ్యూహాత్మకంగా పెట్టుబడులను ఉపసంహరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్ కార్యదర్శుల గ్రూప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019 అక్టోబర్ 23వ తేదీన పోస్కో కంపెనీతో కుదిరిన జాయింట్ వెంచర్ ఉమ్మడి ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. మద్దిలపాలెంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి చెందిన భూమిని అభివృద్ధి చేయడానికి ఎన్బీసీసీతో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు స్టీల్ ప్లాంట్లో పనిచేసే అందరి ఉద్యోగాలను క్రమబద్దీకరించాంటూ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును సీఎండీకి అందజేశారు. 25వ తేదీ తరువాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు.

బీహెచ్ఈఎల్ కూడా..
బీఈఎంఎల్ సహా మెకాన్ లిమిటెడ్, ఆండ్రూ యూల్ అండ్ కో లిమిటెడ్లోనూ వాటాలు విక్రయించనున్నట్లు సమాచారం. దీనిపై నెలరోజుల కిందటే కొన్ని బిజినెస్ న్యూస్ పోర్టల్స్ ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. మలి విడత పెట్టుబడుల ఉపసంహరణ, విక్రయాల జాబితాలో ఈ మూడు కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. బీహెచ్ఈఎల్లో ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉంది. దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు ఆ కథనాలు స్పష్టం చేశాయి. దీనికోసం ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ను సలహాదారుగా కూడా నియమించుకున్నట్లు తెలిపాయి.












Click it and Unblock the Notifications