కొత్త జిల్లాలే కాదు.. కొత్త రాజధాని కూడా: ఆ ప్రసక్తే లేదిక
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన దూకుడును పెంచింది. కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తోంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయాత్తమౌతోంది. మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త డ్రాఫ్ట్ రూపుదిద్దుకుంటోంది.
మేడారం జాతరకు కేసీఆర్: అతిపెద్ద పండగకు జాతీయ హోదా కోసం డిమాండ్
వెనక్కి తగ్గదేలే..
పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని, వాటి సంఖ్యను పెంచుకోవచ్చంటూ కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ఇటీవలే రాజ్యసభలోనూ స్పష్టం చేసిన నేపథ్యంలో- ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో ఇక వెనకడుగు వేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సాంకేతికపరంగా ఎలాంటి అడ్డంకులు కలిగించలేని విధంగా కొత్త వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త రాజధాని కూడా..
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఉగాది నుంచి మనుగడలోకి రానున్నాయి. ఇప్పుడున జిల్లాల సంఖ్య రెట్టింపు కానుంది. 13 నుంచి 26కు పెరగనుంది. కొత్త జిల్లాల్లో పరిపాలన ఉగాది పండగ నాడు ఆరంభమౌతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. వచ్చేనెల మొదటివారంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగియనుంది. అనంతరం వాటన్నింటినీ క్రోడీకరించి.. మెజారిటీ అభిప్రాయాలను గౌరవిస్తూ, వాటికి అనుగుణంగా తుది నోటిఫికేషన్ను జారీ చేయనుంది ప్రభుత్వం. మార్చి మూడో వారంలో తుది నోటిఫికేషన్ విడుదల ఉంటుంది.
జిల్లాలతో పాటు..
అదే ఉగాది రోజున విశాఖపట్నం నుంచి పరిపాలన చేపట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పండగ. ఈ లోగా అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై ఆయన దృష్టి సారించారని అంటున్నారు. మరింత మెరుగైన బిల్లును తెస్తామంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా దీని రూపకల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం.
ఆయన సలహా ఉందా..?
రాజధానిని విశాఖపట్నానికి తరలించే విషయంలో వైఎస్ జగన్- శ్రీ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సలహాలు, సూచనలను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన శారదా పీఠాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి పరిపాలన, మంత్రివర్గ విస్తరణ వంటి కీలక అంశాలపై వైఎస్ జగన్ ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆయన నిర్ణయించిన ముహూర్తం మేరకే ఉగాదికి విశాఖపట్నానికి తరలివెళ్లాలని వైఎస్ జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
4 నుంచి అసెంబ్లీ బడ్జెట్..
మార్చి 4వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు కానున్నాయి. 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును సభలో ప్రవేశపెట్టం దాదాపు ఖాయమైంది. హైదరాబాద్ వంటి సూపర్ కేపిటల్ మోడల్ రాజధాని వల్ల అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి నోచుకోవనే బలమైన అభిప్రాయం వైఎస్ జగన్లో ఉందని, మొదటి నుంచీ ఆయన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నారని అంటున్నారు.