విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారాన్ని ప్రకటించిన వైఎస్ జగన్
విశాఖపట్నం: విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన విశాఖపట్నంలో పర్యటించారు. మృతుల కుటుంబీకులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నష్ట పరిహారంగా కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేస్తానని ప్రకటించారు. పోయిన ప్రాణాలను తీసుకుని రాలేమని బాధితులను ఓదార్చారు.
Recommended Video
ఆ ఎనిమిది మందీ ఆసుపత్రికి చేరకముందే: 10కి చేరుకున్న విశాఖ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య
హుటాహుటిన విశాఖకు..
ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువులను వెలువడించిన సమాచారం అందిన వెంటనే ఆయన హుటాహుటిన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, విశాఖపట్నం జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఉన్నారు.
బాధితులకు పరామర్శ..
విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో కింగ్ జార్జ్ ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. విష వాయువుల ఉదంతం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని రాజేంద్రప్రసాద్ వార్డులో వారంతా చికిత్స పొందుతున్నారు. పోయిన వారిని వెనక్కి తీసుకుని రాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని భరోసా ఇచ్చారు.
గ్రామస్తులకు 10 వేల సాయం..
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ఇస్తానని ప్రకటించారు వైఎస్ జగన్. అదే విధంగా- వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నవారికి 10 లక్షల రూపాయలు చెల్లిస్తానని అన్నారు. ప్రథమ చికిత్స తీసుకుంటోన్న వారికి లక్ష రూపాయల పరిహారాన్ని అందజేస్తామని వెల్లడించారు. తాత్కాలిక అవసరాల కోసం ఇప్పటికిప్పుడు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పారు. అదే సమయంలో- ఈ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి కూడా నష్ట పరిహారాన్ని అందేలా చర్యలను తీసుకుంటామని అన్నారు.
ప్రభుత్వ ఖర్చులతో వైద్యం..
బాధితులకు వైద్యాన్ని అందించడానికి అయ్యే ఖర్చును తామే భరిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులు నియమిస్తున్నట్లు చెప్పారు. మంత్రులు సైతం సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తారని అన్నారు. మొత్తం అయిదు గ్రామాలపై విష వాయువుల ప్రభావం ఉందని, ఆయా గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆయా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికీ 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని అన్నారు.