డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్.. ఆస్పత్రి నుంచి అజ్ఞాతంలోకి.. కూపీ లాగుతోన్న సీబీఐ..
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ సుధాకర్ రావు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియనిస్టుగా పనిచేసిన ఆయన.. కరోనా కట్టడిలో ఏపీ సర్కారు విఫలమైందని, డాక్టర్లకు కూడా మాస్కులు ఇవ్వడంలేదని తీవ్ర విమర్శలు చేయడంతో సస్పెండ్ కావడం, ఆ తర్వాత విశాఖపట్నంలో సడెన్ గా ప్రత్యక్షమై, అర్థనగ్నంగా రోడ్డుపైనే అరెస్టు కావడం, దానిపై ఏపీ హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం తెలిసిందే. ఎన్నో మలుపుల తర్వాత వైజాగ్ మెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సుధాకర్.. శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Recommended Video

రహస్య ప్రాంతంలో..
హైకోర్టు ఆదేశాలతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం సిటీలోనే ఓ రహస్య ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు సన్నిహితులు మీడియాకు తెలిపారు. వచ్చే ఐదు రోజులపాటు ఆయన ఎవరినీ కలువబోరని, ఫోన్ లోనూ అందుబాటులో ఉండబోరని పేర్కొన్నారు. తనకు మానసకి ప్రశాంతత కావాలని సుధాకర్ కోరుకున్నారని, ఆ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని సన్నిహితులు చెప్పారు. మరోవైపు..

నర్సీపట్నంలో సోదాలు..
ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని చేపట్టిన సీబీఐ.. దర్యాప్తులో వేగం పెంచింది. సస్పెన్షన్ వేటు పడకముందు సుధాకర్ పనిచేసిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి సర్వీసు రికార్డు, అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలనతోపాటు సిబ్బంది ద్వారా కొన్ని కీలక వివరాలను సీబీఐ సేకరించింది. తోటివారే తనను మోసం చేశారని, రెచ్చగొట్టి మాట్లాడించి, వీడియో రికార్డు చేశారని సుధాకర్.. జడ్జికి ఇచ్చిన వాగ్మూలంలో పేర్కొన్న నేపథ్యంలోనే సీబీఐ అధికారులు నర్సీపట్నంలో పర్యటించినట్లు తెలుస్తోంది. అంతే కాదు..

ఆ పని చేసిందెవరు?
డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంలో అనుచితంగా ప్రవర్తించారంటూ వైజాగ్ పోలీసులపై దాఖలైన కేసును సీబీఐ విచారిస్తున్నది. అయితే, అదే సీబీఐ.. సుధాకర్ పై.. నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై మాట తూలడం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో మరో కేసు నమోదు చేయడం తెలిసిందే. కాగా, అసలు సుధాకర్ ను మెంటల్ ఆస్పత్రిలో ఎవరు చేర్పించారన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాకపోవడం గమనార్హం. ఆయనే వచ్చిచేరారని సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి చెబుతుండగా, కాదూ పోలీసులే ఆయనను తరలించారని కేజీహెచ్ అధికారులు అంటున్నారు. దీనిపైనా సీబీఐ మరింత లోతుగా విచారిస్తోంది.

వీరమాత కావేరీబాయి..
సుధాకర్ సస్పెన్షన్, అరెస్టు వ్యవహారంలో ఆయనకు అన్ని రకాలుగా మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష టీడీపీ.. బాధిత డాక్టర్ దళితుడు కాబట్టే వైసీపీ సర్కారు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నది. సుధాకర్ విషయంలో ముందు నుంచీ స్పందిస్తోన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తాజాగా అమెరికాలో చోటుచేసుకున్న జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం లాంటిదే సుధాకర్ ఘటన అని వ్యాఖ్యానించారు. జగస్ సర్కారుపై పోరాడిమరీ తన కొడుకును కాపాడుకున్న వీరమాత కావేరీబాయి అని సుధాకర్ తల్లిని ఉద్దేశించి వర్ల అన్నారు. సుధాకర్ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతోనే ఆయనను డిశ్చార్జ్ చేయాలన్న ఆదేశాలు జారీకావడం తెలిసిందే.












Click it and Unblock the Notifications