గంటా బాటలో మరి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు?: రాజీనామాలు వద్దంటోన్న చంద్రబాబు?
విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా భావిస్తోన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు.. రాజకీయాలను వేడెక్కించాయి. రాజీనామాలకు పర్వానికి దారి తీస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని విక్రయించాలనే ప్రతిపాదనలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. తోటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా అదే బాటలో సాగేలా, వారిపై రాజకీయపరమైన ఒత్తిళ్లు తీసుకుని రావడానికి కారణమౌతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కన్నేసిన వైఎస్ జగన్: ప్రైవేటీకరణను అడ్డుకునేలా రెండంచెల మాస్టర్ ప్లాన్
తోటి ఎమ్మెల్యేల మాటేంటీ?
గంటా శ్రీనివాస రావు విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే తెలుగుదేశం పార్టీకే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు (గణబాబు), విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వైపు ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది. టీడీపీకే చెందిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంటా శ్రీనివాస రావు తరహాలో మిగిలిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీన్ని వారిద్దరూ తోసిపుచ్చకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గంటా రాజీనామాకు ఓ అవకాశం దొరికినట్టు..
నిజానికి- గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు. రాష్ట్రంలో అధికారం చేతులు మారినప్పటి నుంచీ ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకదశలో టీడీపీని వీడటానికి సిద్ధ పడ్డారనే వార్తలు సుదీర్థకాలం నుంచి వినిపిస్తోన్నాయి. వైఎస్సార్సీపీ, లేదా బీజేపీలో చేరడం ఖాయమమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అవేవీ వాస్వవరూపం దాల్చలేదు. క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ.. టీడీపీలోనే ఉంటూ వస్తున్నారు. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం రావడంతో.. దాన్ని అడ్డుగా పెట్టుకుని రాజీనామా చేశారనే వాదనలు ఉన్నాయి.
రాజీనామాలకు చంద్రబాబు వ్యతిరేకమా?
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి నిరసనగా గంటా శ్రీనివాస రావు రాజీనామా చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారని అంటున్నారు. ఆయన రాజీనామా వల్ల తోటి ఎమ్మెల్యేలపై మరింత రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడుతాయని ఆయన భాావిస్తున్నట్లు తెలుస్తోంది. వారు కూడా రాజీనామా చేయడం, దాన్ని స్పీకర్ ఆమోదించడమంటూ జరిగితే.. ప్రతిపక్ష హోదా ఉండదనే ఆందోళన చంద్రబాబులో వ్యక్తమౌతోన్నట్లు సమాచారం. రాజీనామాలకు సిద్ధపడకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలంటూ ఆయన ఇదివరకే విశాఖపట్నం జిల్లా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారని అంటున్నారు.
నాన్ జేఏసీకి అండ ఎవరు?
గంటా శ్రీనివాస రావు రాజీనామా చేయడం, స్టీల్ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని ఆయన స్పీకర్ను కోరడం చర్చనీయాంశమౌతోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఓ ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారయన. ఈ జేఏసీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడిగా ఒత్తిళ్లను తీసుకుని రావాలని భావిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఏర్పాటు కాబోయే ఈ జేఏసీకి అండగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.