స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సెగల మధ్య వైజాగ్కు వైఎస్ జగన్
విశాఖపట్నం: అయిదు దశాబ్దాల పాటు రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై రోజురోజుకూ నిరసన జ్వాలలు మరింత చెలరేగుతున్నాయి. ఆందోళనలకు తీవ్రతరమౌతోన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్ నిరసన దీక్షకు సైతం దిగారు. కార్మిక సంఘాలు రోడ్డెక్కుతోన్నాయి. వామపక్ష పార్టీల నాయకులు, అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన నిరవధిక నిరాహార దీక్షను పూనుకోనున్నారు.

శారదా పీఠం వార్షికోత్సవాలకు..
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విశాఖపట్నం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 17వ తేదీన ఆయన విశాఖకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చినముషివాడలోని విశాఖ శారదా పీఠాన్ని ఆయన సందర్శించనున్నారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవానికి జగన్ హాజరవుతారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులను పొందనున్నారు. పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలంటూ కొద్దిరోజుల కిందటే స్వాత్మానందేంద్ర స్వామి.. జగన్ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించిన విషయం తెలిసిందే. రెండేళ్ల తరువాత శారదా పీఠాన్ని ఆయన సందర్శించడం ఇదే తొలిసారి అవుతుంది.

నిరసనల సెగ..
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరసన ప్రదర్శనలు సెగలు పుట్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య వైఎస్ జగన్.. సాగర నగరాన్ని సందర్శించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పర్యటనను అడ్డుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ, సీపీఐ, సీపీఎం నేతలు, కార్మిక సంఘాలు జగన్ను నిరసన కార్యక్రమాలతో స్వాగతం పలుకుతారని అంటున్నారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై స్పష్టమైన ప్రకటన చేసేలా వారంతా జగన్పై ఒత్తిడిని తీసుకొచ్చేలా ప్రయత్నాలు సాగిస్తారనే ప్రచారం విశాఖపట్నంలో ఊపందుకుంటోంది.

18 నుంచి ఉద్యమాలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కార్మిక సంఘాలు మరింత ఉద్యమించబోతోన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కానున్నాయి. 18వ తేదీన నిరాహార దీక్షలు దిగనున్నాయి. విశాఖలో యుటిఎఫ్ ఆధ్వర్యాన నిర్వహించిన రౌంట్టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రైవేటీకరణను అడ్డుకునేలా, ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 32 మంది బలిదానాలతో సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications