విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనక సీఎం జగన్ హస్తం..? అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం అగ్గిరాజేస్తోంది. ప్రత్యేక హోదా గురించి కాక.. విశాఖ ఉక్కుపై ఏపీ నేతలు పోరుబాట పట్టారు. కానీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇష్యూ తీవ్రత పెరగడంతో కేంద్రం స్పందించింది. నీతి అయోగ్ సిఫారసుల మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నామని ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ సిఫారసు మేరకేనట..
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయించాలని నీతి ఆయోగ్ పేర్కొందని తెలిపారు. ఆ ప్రకారమే తాము ముందుకు వెళతామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించాలనే ఆలోచన తమకు లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. బడ్జెట్ను జాతీయ దృక్పథంతో చూడాలని కోరారు. ఇటీవల కాలంలో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోలవరం నిధుల గురించి తమను మూడుసార్లు కలిశారని గుర్తుచేశారు. ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నామని అనురాగ్ ఠాకూర్ వివరించారు.
లక్షల కోట్ల ఆస్తుల కోసమే
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లక్ష కోట్ల ఆస్తుల కోసమే సీఎం జగన్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. ఇదే విషయం అందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ రెడ్డి అసలు టార్గెట్ బాక్సైట్ అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. లక్ష కోట్లను 2009లోనే జగన్ సాధించాడని.. ఇంకా ఎక్కువ సంపాదనపై ఫోకస్ చేశారని తెలిపారు. లక్షల కోట్ల విలువైన బాక్సైట్ మీద వేసిన స్కెచ్ లో భాగమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం అని అయ్యన్నపాత్రుడు వివరించారు.
జగన్ బినామీలే
స్టీల్ ప్లాంట్ను జగన్ తన బినామీలతో కొనుగోలు చేయించి, బాక్సైట్ వెలికితీతను ఆ కంపెనీకి అప్పజెప్పే స్కెచ్ ఇది అని అయ్యన్నపాత్రుడు అన్నారు. దీంతో లక్షల కోట్లు వెనకేసేందుకు చేస్తున్న భారీ కుట్ర అని ఆరోపించారు. మనం మరో ఓబులాపురం చూడబోతున్నాం అని.. మరో గాలి జనార్దన్ రెడ్డిని చూడబోతున్నాం అని తెలిపారు. ఈ కుట్రను ఉత్తరాంధ్రే కాదు 5 కోట్ల ఆంధ్రులు అడ్డుకుంటారని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ అయ్యన్న ఉద్ఘాటించారు.