స్టీల్ ప్లాంట్ పోరాటం అంటే కత్తి తీసుకెళ్ళి యుద్ధం చెయ్యాలా? ఆ త్రయంపై వైసీపీ మంత్రి ధ్వజం
వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబుపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, మాజీ మంత్రి లోకేష్ పై నిప్పులు చెరిగారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో టిడిపి, జనసేన నేతల విమర్శలపై మండిపడిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ చంద్రబాబు దిగజారుడు రాజకీయం
స్టీల్ ప్లాంట్ పోరాటం అంటే కత్తి తీసుకుని వెళ్లి పోరాడాలా, యుద్ధం చెయ్యాలా అంటూ ప్రశ్నించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని లేఖలు రాశారని ,రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిణామాలపై విరుచుకుపడ్డారు. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ వైఖరి సుస్పష్టం
చంద్రబాబు ప్రస్తుతం ఎన్నికలను బహిష్కరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబును బహిష్కరిస్తారని మంత్రి అవంతి విమర్శలు గుప్పించారు. గెలిచే దమ్ము లేకనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని ఎద్దేవా చేశారు . ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని ,
ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్తామని పేర్కొన్న మంత్రి అవంతి రాష్ట్రంలో ప్రతిదానికి రాద్ధాంతం చేయడం టిడిపి నేతలకు అలవాటుగా మారిందన్నారు.

వైసీపీ ఎంపీలు గొర్రెలు అయితే మీ ఎంపీల మాటేంటి ?
నిన్న తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో ఎంపీలను గొర్రెలతో పోల్చడం పై మండిపడ్డారు. లోకేష్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అవంతి శ్రీనివాస్, ఎంపీలను గొర్రెలతో పోల్చడం ఏంటి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎంపీలు గొర్రెలు అయితే మీ పార్టీల ఎంపీలు ఏంటి అంటూ లోకేష్ పై మండిపడ్డారు.
వివేకానంద రెడ్డి హత్య కేసుపై సిబిఐ విచారణ చేస్తోందని పేర్కొన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. సిబిఐ కేంద్ర పరిధిలో పని చేస్తుందని దీనిపై అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ పై కూడా అవంతి శ్రీనివాస్ విసుర్లు
పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. కొన్నిసార్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతుందని, అంతమాత్రాన రాద్ధాంతం చేయాలని ప్రశ్నించిన మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రజారంజకంగా జగన్ పాలన సాగిస్తుంటే ఓర్వలేకనే టిడిపి జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇక తిరుపతి ఉప ఎన్నికల నేపధ్యంలో టీడీపీ , జనసేననేతలు ఎంత దుష్ప్రచారం చేసినా విజయం వైసీపీదే అని తేల్చి చెప్పారు మంత్రి అవంతి శ్రీనివాస్ .












Click it and Unblock the Notifications