Mansas trust..మరింత హీట్: భూముల కేటాయింపుపై విజిలెన్స్ దర్యాప్తు: నోడల్ అధికారి అపాయింట్
విజయనగరం: చాలా రోజులుగా వార్తల్లో ఉంటూ వస్తోన్న చారిత్రాత్మక మన్సాస్ ట్రస్ట్ వ్యవహారం.. మరోసారి తెర మీదికి వచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశానికి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ అంశంపై ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గట్లేదు. సంచయిత నియామకాన్ని హైకోర్టు కొట్టి వేయడం, టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజును రీ అపాయింట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన అనంతరం మన్సాస్ ట్రస్ట్ వ్యవహారాన్ని ప్రభుత్వం ప్రిస్టేజియస్గా తీసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్నట్టుగా భావిస్తోన్న భూకేటాయింపులను తవ్వితీస్తోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింహాచలం దేవస్థానం పాలక మండలికి అశోక్ గజపతి రాజు ఛైర్మన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆయన హయాంలో సింహాచలం ఆలయానికి చెందిన 862 ఎకరాలు మాన్యం భూములు కాదంటూ నిర్ధారించిన అంశాన్ని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ భూములు మన్సాస్ ట్రస్ట్కు బదలాయించి ఉండొచ్చంటూ వ్యక్తమౌతోన్న అనుమానాల మధ్య.. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఇదివరకే ఆదేశించింది. తాజాగా- దేవాదాయ శాఖ కమిషనర్ను ఈ విచారణకు నోడల్ అధికారిగా నియమించింది.

అశోక్ గజపతి రాజు ఛైర్మన్గా ఉన్న సమయంలో సింహాచలం దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి తొలగించిన ఆ 862 ఎకరాలు ఏమయ్యాయి?, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి?, ఎవరి ఆధీనంలో ఉన్నాయనే విషయం మీద విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించనున్నారు. దీనిపై సమగ్ర విచారణను చేపట్టాలంటూ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశించింది. మూడు నెలల్లోగా విచారణ ముగించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమగ్ర నివేదికను అందచేయాలని ఆదేశించింది.
విజయనగరంలో వైద్య కళాశాలను నిర్మించాలనే ఉద్దేశంతో మన్సాస్ ట్రస్టు భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయించడంపైనా ఈ దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తోంది. సింహాచలం దేవస్థానం, మన్సాస్ ట్రస్టులో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అంటే 2016 నుంచి 2018 మధ్య పెద్ద ఎత్తున భూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు దేవదాయ శాఖ గుర్తించింది. దీనిపై వంద పేజీల నివేదికను దేవదాయ శాఖ అధికారులు కమిషనర్కు అందజేశారు. ఆలయ ఆస్తుల జాబితా నుంచి 862 ఎకరాల మేర భూములను తొలగించిన విషయం నిజమేనంటూ అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు.
చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించగా.. అందులో అత్యధిక భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవేనని తేలింది. సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న స్థిరాస్తులు, అధికారులు అందించిన నివేదిక, సీసీఎల్ఏలో ఉన్న భూ రికార్డులను ఆధారంగా చేసుకుని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన దర్యాప్తును కొనసాగించనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో భాగస్వామ్యలైన అప్పటి సింహాచలం ఈవో, ప్రస్తుతం దేవదాయ శాఖ అదనపు కమిషనర్గా పనిచేస్తున్న రామచంద్రమోహన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ విజిలెన్స్ దర్యాప్తు వ్యవహారం మళ్లీ రాజకీయ రంగును పులుముకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సంచయిత-అశోక్ గజపతి రాజు వ్యవహారంలో చోటు చేేసుకున్న పరిణామాలన్నీ వైసీపీ-టీడీపీల చుట్టూ తిరిగినవే. సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు కూడా అదే తరహాలో మారే అవకాశాలు లేకపోలేదు. భూముల కేటాయింపు విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే- యుద్ధ ప్రాతిపదికన దేవాదాయ శాఖ కమిషనర్ను నోడల్ అధికారిగా నియమించడంతో పాటు మూడు నెలల గడువులోగా సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది.












Click it and Unblock the Notifications