నేనే రాణి- నేనే మంత్రి- సంచైత దూకుడుతో పూసపాటి వంశీయులకు చుక్కలు...
విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన పలు సంస్ధల్లో, వాటి వ్యవహారాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సంచైత గజపతిరాజు పేరే వినిపిస్తోంది. ఓవైపు మాన్సాస్ను, మరోవైపు సింహాచలం ఆలయాన్ని, ఇంకోవైపు వంశ రాజకీయాలను మోస్తున్న సంచైత.. గతంలో తనకూ తన కుటుంబానికీ అవమానం జరిగిన చోటే రాజమర్యాదలను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలు బాబాయ్ అశోక్ గజపతిరాజు వంటి దిగ్గజాలనే కాదు సోదరి ఊర్మిళ, పిన్ని సుధా గజపతిరాజుల పాత్రను నామమాత్రంగా మార్చేశాయి. ఒకప్పుడు విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రలో ఎంతో గౌరవ మర్యాదలు పొందిన వీరంతా ఇప్పుడు సంచైత దూకుడు కారణంగా మొహం చాటేయాల్సిన పరిస్ధితి.

జేజమ్మ దూకుడుతో మారిన సీన్...
అతి చిన్న వయసులో మాన్సాస్, సింహాచలం బోర్డు ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టడం ద్వారా విజయనగరంలోని పూసపాటి రాజ వంశీకుల రాజకీయాల్లో కాలుమోపిన సంచైత గజపతిరాజుపై వైసీపీ ప్రభుత్వం పెద్ద బాధ్యతనే పెట్టింది. వారసత్వం తప్ప రాజకీయాలు తెలియని సంచైత ఎంతకాలం ఈ పదవుల్లో ఉంటుందని అంతా పెదవి విరిచారు. ఊహించినట్లుగానే ఆమె తప్పటడగులు వేయడం కూడా మొదలుపెట్టింది. ఓ దశలో వైసీపీ ప్రభుత్వాన్ని అవి తెక చికాకు పెట్టాయి కూడా. కానీ కాలక్రమేణా అక్కడి రాజకీయాలను వంటబట్టించుకోవడం మొదలుపెట్టిన సంచైత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా ఒక్క మాట మాట్లాడకుండానే తాను అనుకున్న వ్యూహాన్ని పక్కాగా అమలు చేసేస్తున్నారు. తద్వారా వైసీపీ ప్రభుత్వం కోరుకున్న విధంగానే మసలుకుంటున్నారు.

సంచైతకు గతమే అనుభవం...
మాన్సాస్, సింహాచలం బోర్డుల ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టే నాటికి అక్కడేం జరుగుతుందో సంచైతకు తెలియదు. వారసురాలు అన్న మాటే కానీ ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో చదువులు, ఢిల్లీలో బీజేపీతో సంబంధాలు మినహా ఆమెకు విజయనగరం రాజకీయాల్లో తెలిసింది తక్కువే. కానీ గతంలో తండ్రి ఆనంద్ గజపతిరాజు మరణం తర్వాత తాను, తన కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు మాత్రమే ఆమెకు గుర్తున్నాయి. వాటిపై కోపం మాత్రం అలా ఉండిపోయింది. ఇప్పుడు దాన్నే సంచైత బయటికి తీస్తున్నారు. ఏ ప్రభుత్వాల అండతో, నేతల అండతో రాజకీయాలు చేసి తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు తానూ అదే బాటలో సాగాలని సంచైత భావిస్తున్నారు. దీంతో రోజుకో రకంగా ఆమె రాటుదేలుతున్నారు.

బాబాయ్ అశోక్ హవాకు చెక్..
పూసపాటి రాజవంశంలో సంచైత తండ్రి ఆనంద గజపతిరాజు మరణం తర్వాత మొదలైన బాబాయ్ అశోక్ గజపతిరాజు హవా నిన్న మొన్నటివరకూ నిరాటంకంగా కొనసాగింది. ముఖ్యంగా మాన్సాస్, సింహాచలం ట్రస్టుల పాలకమండలి ఛైర్మన్గా, విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా అశోక్ హవాకు ఎదురేలేకుండా పోయింది. కానీ సంచైత రాక తర్వాత ఆయనో సాధారణ వ్యక్తిగా మారిపోయారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆయనకు దక్కిన గౌరవ మర్యాదలన్నీ మాయమైపోయాయి. సంచైత ఎంట్రీతో ఒకప్పుడు ఆయన హవా సాగిన అన్ని సంస్ధల్లో, వ్యవహారాల్లో ఇప్పుడు ఆయన్ను పట్టించుకునేవారే లేకపోయారు. దీంతో పరిస్ధితిని గమనించిన అశోక్ గజపతిరాజు ఇప్పుడు తన బంగ్లాకే పరిమితమవుతున్నారు. తాజాగా విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతరలోనూ తొలిసారి అశోక్ కనిపించలేదు.

పిన్ని కుటుంబాన్నీ దూరం పెడుతున్న సంచైత...
తండ్రి ఆనంద గజపతిరాజు రెండో భార్య సుధాగజపతిరాజు, ఆమె కూతురు ఊర్మిళా గజపతిరాజుతో సంచైతకు ప్రత్యేకంగా శత్రుత్వమేదీ లేదు. అయినా వీళ్లను కూడా సంచైత పక్కనబెడుతున్నారు. పూసపాటి వంశ రాజకీయాలను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సంచైత వ్యూహాత్మకంగానే వీరిని దూరం పెడుతున్నారు. సంచైత పగ్గాలు చేపట్టేవరకూ ఆమె దరిదాపుల్లోకి రాని సుధా, ఊర్మిళ ఇప్పుడు మాన్సాస్ వ్యవహారాల్లో మాకూ అవకాశం దక్కాలని వాదిస్తున్నారు. అశోక్కు అవకాశం లేనందున ఆనంద్ వారసులుగా సంచైతతో పాటు తమకూ అన్ని హక్కులూ ఉన్నాయని వీరు వాదిస్తున్నారు. అయినా వీరిని దగ్గరికి రానిచ్చేందుకు సంచైత ఇష్టపడటం లేదు. పూసపాటి వంశ రాజకీయాల్లో తాను ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని భావిస్తున్న సంచైత ..
తాజాగా జరిగిన పైడితల్లి జాతరలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీరికి అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో వీరు నిరాశగా వెనుదిరగక తప్పలేదు.












Click it and Unblock the Notifications