దేవుడితో రాజకీయం: బూటుకాళ్లతో రామతీర్థానికి చంద్రబాబు: వైసీపీ నేతలు భగ్గు: ఘాటుగా సాయిరెడ్డి
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలకు కేంద్రబిందువు అయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని ఆయన బూటుకాళ్లతో సందర్శించడం పట్ల వివాదాలు చెలరేగుతున్నాయి. ఇదివరకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన తన హయాంలో నిర్వహించిన శంకుస్థాపనలు, ఇతర పండగల సమయంలో బూటుకాళ్లతో కనిపించిన ఫొటోలు ఇప్నుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు వైఖరి పట్ల భగ్గుమంటున్నారు.
ఏనాడైనా రామతీర్థాన్ని సందర్శించారా?
చంద్రబాబు రాజకీయాల కోసం మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దేవుడి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శిస్తున్నారు. తన ప్రభుత్వ హయాంలో పుష్కరాల పేరుతో గుళ్లను కూలదోయించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే ఆలయాలను అడ్డుగా పెట్టుకుని మత విధ్వేషాలను రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏనాడూ రామతీర్థం ఆలయాన్ని సందర్శించని ఆయన.. రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ క్షేత్రాన్ని సందర్శించారని ఆరోపించారు.
వీసమెత్తు భక్తి లేదంటూ..
చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎంతోమందిని వాడుకుని వదిలేశారని, ఇక దేవుళ్లతోనూ అలాంటి పనే చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బూటు కాళ్ళతో రామతీర్థం పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టిన చంద్రబాబు తీవ్ర అపచారానికి పాల్పడ్డారని వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబు కంటే ముందు తాను రామతీర్థాన్ని సందర్శించానని, బూట్లు విడిచి తాను రామతీర్థం కొండను అధిరోహించానని గుర్తు చేశారు. హిందువులే కాదు.. ఏ మతానికి చెందిన వారైనా ఆలయాలు, ప్రార్థనా స్థలాలను బూట్లు, చెప్పులు ధరించి సందర్శించబోరని అన్నారు.
రాజకీయ లబ్ది కోసమే
చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నారని సాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయనకు దేవుడిపై భక్తి, సంప్రదాయాల పట్ల వీసమెత్తు గౌరవం లేదని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో తన ఘనతను చాటుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు, ఆయన కుటుంబం.. 29 మంది ప్రాణాలను బలి తీసుకుందని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు ఆరోపించారు. దేవాలయాలపై జరిగే దాడుల వెనుక కుట్ర కోణం ఉందని, అది తెలుగుదేశం పార్టీ నేతలే దీనికి కారణమని అన్నారు. రామతీర్థంలో రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే ఇద్దరు టీడీపీ నాయకులు అరెస్ట్ అయ్యారని చెప్పారు.