కేసీఆర్ సర్కార్కు డేంజర్ బెల్స్: ఎమ్మెల్సీ ఎన్నికలే డెడ్లైన్: కుప్పకూలడం ఖాయం: బండి సంజయ్
వరంగల్: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ.. మరో కర్ణాటక, మధ్యప్రదేశ్ కాబోతోందంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అయిదేళ్ల పాటు మనుగడ కొనసాగించలేదని, అర్ధాంతరంగా కుప్పకూలిపోతుందని పేర్కొన్నారు. రెండు శాసన మండలి స్థానాలకు జరిగే ఎన్నికలే డెడ్లైన్ అని స్పష్టం చేశారు. ఈ రెండు ఎమ్మెల్సీలను తాము గెలుచుకోబోతోన్నామనే ధీమాను బండి సంజయ్ వ్యక్తం చేశారు. ఆ భయంతోనే కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించారని చెప్పుకొచ్చారు.

బండి సంజయ్ విస్తృత పర్యటన..
తెలంగాణలో ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల ప్రచారం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్ రామచందర్ రావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తోన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

రెండు మండలి స్థానాలను గెలవబోతున్నాం..
వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి బరిలో నిల్చున్న ప్రేమేందర్ రెడ్డి తరపున.. బండి సంజయ్ ప్రచారం నిర్వహిసున్నారు. ఇందులో భాగంగా వరంగల్లో నిర్వహించిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు శాసన మండలి స్థానాలను తాము గెలుచుకోబోతోన్నామని అన్నారు. అధికార పార్టీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఆ భయం ముఖ్యమంత్రి కేసీఆర్లో కనిపిస్తోందని చెప్పారు. అందుకే- హడావుడిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను అదే పనిగా ప్రగతి భవన్కు పిిలిపించుకుని పీఆర్సీ గురించి ప్రకటన చేశారని అన్నారు.

ఎన్నికల తరువాత ప్రభుత్వం కూలిపోతుంది..
ఇదివరకు కేసీఆర్ ఏనాడు కూడా పీఆర్సీ గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. రెండు ఎమ్మెల్సీలను గెలిచాక టీఆర్ఎస్ సర్కారు కుప్ప కూలిపోతుందని హెచ్చరించారు. అందుకే కేసీఆర్లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి మభ్య పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల పీఆర్సీ కోసం కొట్లాడింది తాము మాత్రమేనని అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించి.. వారి చెవిలో మందారం పువ్వులు పెట్టే ప్రయత్నాన్ని కేసీఆర్ చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పని చేయాలంటూ ప్రలోభ పెట్టారని ఆరోపించారు.

పీఆర్సీ కోసం ఫైట్ చేసింది మేమే
కేసీఆర్ మాటలను వినే పరిస్థితిలో ఉద్యోగ సంఘాలు లేవని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ హామీలను విశ్వసించే పరిస్థితుల్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ పీఆర్సీ ఊసే ఎత్తని కేసీఆర్.. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించడానికి ప్రధాన కారణం.. ఆయనలో నెలకొన్ని భయమేనని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీఆర్సీ కోసం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడారని, ఉద్యోగులకు అండగా నిలిచారని అన్నారు. పోలీసులతో లాఠీల దెబ్బలు తిన్నారని పేర్కొన్నారు. తాము చేసిన ఆందోళనల వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని బండి సంజయ్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications