వరంగల్ లో క్షుద్రపూజల కలకలం.. గొర్రెలు, కోళ్ళు బలి..ఒళ్ళు గగుర్పొడిచేలా హంగామా!!
వరంగల్: శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు కనిపిస్తూనే ఉన్నాయి. రాకెట్ స్పీడ్ లో ఒక కొత్త ప్రపంచం దూసుకుపోతుంటే మరోవైపు జనాల్లో మూఢ నమ్మకాలు కూడా జెట్ స్పీడులో దూసుకుపోతున్న పరిస్థితులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో క్షుద్ర పూజలు, మంత్రాల భయంతో ప్రజలు వణికిపోతున్న పరిస్థితులు ఉన్నాయి.
వరంగల్ లో కలకలం రేపిన క్షుద్రపూజలు
తాజాగా వరంగల్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలంగా మారాయి. వరంగల్ నగరంలోని తాళ్ల పద్మావతి కళాశాల ప్రాంతంలో ఓ పాడుబడిన భవనంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఒక గొర్రెను, కోడిని చంపి బట్టలు, పసుపు, కుంకుమతో కలిపినటువంటి అన్నం, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఇలా ఒకటేమిటి భారీ ఎత్తున క్షుద్రపూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. ఇక ఆ ప్రదేశాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
క్షుద్రపూజలు చేసింది ఎవరు? స్థానికంగా చర్చ
అయితే ఇంతకీ క్షుద్రపూజలు చేసింది ఎవరు? ఏ సమయంలో ఇదంతా జరిగింది? దీనివల్ల ఎవరికి హాని కలగబోతుంది అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అర్దరాత్రి సమయంలో క్షుద్రపూజలు నిర్వహించినట్టు గుర్తిస్తున్నారు. ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షుద్ర పూజలు నిర్వహించిన వారు ఎవరూ అన్నదానిని ఆరా తీస్తున్నారు. ఇలాంటివి నమ్మొద్దని స్థానికులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఇటీవలఖమ్మం జిల్లాలోనూ క్షుద్రపూజల కలకలం
ఇక ఇదిలావుంటే ఇటీవల ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబురు గ్రామంలో కూడా క్షుద్ర పూజల కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు కూడా స్థానికులు హడలిపోయారు. తుంబురు గ్రామంలోని శివ గంగ వాటర్ ప్లాంట్ వద్ద కొందరు దుండగులు అర్ధరాత్రి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు మిరపకాయలతో ముగ్గులు వేశారు. ఇక ఉదయాన్నే ఆ హంగామా చూసినవారంతా ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారని తమకు చేతబడి చేస్తున్నారని లబోదిబోమన్నారు.
క్షుద్రపూజలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రజలు
క్షుద్రపూజలు, చేతబడులు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేశారు. ఏది ఏమైనా అన్ని రంగాల్లో ముందుకుపోతుంటే, ఇంకా సమాజంలో పేరుకుపోతున్న మూఢనమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతున్నాయి అని ఇటువంటి ఘటనలతో అర్థమవుతుంది. కొందరు డబ్బుల కోసం, మరికొందరు తమకు గిట్టనివారిని నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో క్షుద్రపూజలను, మాంత్రికులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నేటికీ కనిపిస్తుంది. ఇక వారు కోళ్ళు, గొర్రెలు బలిచ్చి నానా హంగామా చేస్తూ జనాలను మానసికంగా భయాందోళనకు గురి చేస్తున్నారు.