తాళి కట్టే సమయానికి పెళ్లి వద్దంటూ నవవధువు ట్విస్ట్: అతిథిగా వచ్చి జీవిత భాగస్వామిగా మారిన మరో యువతి
వరంగల్: అప్పుడప్పుడు సినిమాల్లో చోటు చేసుకున్న ఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. చివరి నిమిషంలో పెళ్లి ఆగడం లేదా ఎవరో వచ్చి ఆపడం లాంటి సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ, ఇక్కడ వాస్తవంగానే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పెళ్లి పీటలపై ఎక్కిన ఓ నవవధువు.. తాళి కట్టే సమయం దగ్గరపడుతుండగా.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని మండపం నుంచి బయటకికి వెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో చోటు చేసుకుంది.

షాకిచ్చిన నవవధువు..
ఆ వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలం గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. వధూవరులు పెళ్లిపీటలపై కూర్చున్నారు. పండితులు వేద మంత్రాల చదువుతున్నారు. మరికొద్ది క్షణాల్లో నవవరుడు వదువు మెడలో తాళి కట్టనున్నాడు. ఇంతలోనే నవవధువు అందరికీ షాకిచ్చింది.

తాళి కట్టే సమయానికి పెళ్లి వద్దంటూ..
తనకు ఈ వివాహం ఇష్టం లేదని చెప్పి.. పెళ్లి పీటలపైనుంచి లేచింది. తనకు ఇష్టం లేదని చెప్పినా.. కుటుంబ పెద్దలు తనను బలవంతంగా పెళ్లి పీటలదాకా తెచ్చారని వాపోయింది. అంతేగాక, తాను ఈ పెళ్లి చేసుకోలేనని, దయచేసి ఈ పెళ్లిని ఆపాలని వేడుకుంది. పోలీసులను ఆశ్రయించడంతో సీఐ, ఎస్ఐతోపాటు పెళ్లి మండపానికి వచ్చి విచారణ చేశారు. నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా.. ఆ నవవధువు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో చేసేదేంలేక ఆ పెళ్లిని రద్దు చేశారు.

మరో యువతి ఎంట్రీ.. పెళ్లి కథ సుఖాంతం
ఆ తర్వాత ఆమెను కౌన్సిలింగ్ నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. తాను వేరే యువకుడిని ప్రేమించినట్లు ఆ యువతి పేర్కొనడం గమనార్హం. తాము వచ్చిన పెళ్లిలో ఇలాంటి అనుకోని పరిణామాలు చోటు చేసుకోవడంతో పెళ్లికివచ్చిన అతిథులు ఏం జరుగుతుందోనని ఉత్కంఠకు గురయ్యారు. ఇది ఇలావుండగా, నవవధువు చర్యను పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు అవమానంగా భావించారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన సమీప బంధువుల అమ్మాయితో తమ కుమారుడి వివాహం జరిపించారు. దీంతో వరుడి తరపువారి కథ సుఖాంతమైంది.












Click it and Unblock the Notifications