షర్మిలపై దాడి ఎఫెక్ట్- పోలీస్ కమిషనర్పై రాత్రికి రాత్రి బదిలీ వేటు - కొత్త సీపీగా..!!
వరంగల్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఉదంతం అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమెపై జరిగిన దాడి, హైదరాబాద్లో అరెస్ట్- అనంతరం హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం.. ఆయా పరిణామాలతో వార్తల్లో నిలిచారు. అధికార టీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలన్నీ వైఎస్ షర్మిలపై జరిగిన దాడి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ తప్పు పట్టాయి. అధికార పార్టీ వైఖరిని ఎండగట్టాయి.
షరతులతో బెయిల్..
ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద వైఎస్ షర్మిలపై దాడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీని తరువాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. షర్మిల కాన్వాయ్లోని వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్టీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో ఆమె గాయపడటం- ఉద్రిక్త పరిస్థితులను మరింత వేడెక్కించాయి.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల హంగామా..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఆమె కాన్వాయ్లోని ఓ వాహనంపై ఎమ్మెల్యే అనుచరులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరో కారు అద్దాలను పగులగొట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దానికీ నిప్పంటించారు. అక్కడే అమర్చిన వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను తగులబెట్టారు.
పోలీసుల వైఫల్యంగా..
ఈ పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల కాన్వాయ్పై దాడి చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అనుచరులను కాకుండా- ఆమెనే అరెస్ట్ చేయడం, పాదయాత్రను అడ్డుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్యేతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని తప్పుపట్టారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఉదంతం చోటు చేసుకుందంటూ మండిపడ్డారు.
సీపీపై వేటు..
దీనితో ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిపై బదిలీ వేటు వేసింది. ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తరుణ్ జోషి స్థానంలో- హైదరాబాద్ నగర పోలీస్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ను వరంగల్కు బదిలీ చేశారు. రంగనాథ్ను వరంగల్ పోలీస్ కమిషనర్గా అపాయింట్ చేశారు.
దీని తరువాతే..
ఈ దాడి, అరెస్ట్ తరువాతే వైఎస్ షర్మిల- ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. రాజకీయంగా టీఆర్ఎస్కు ఇది మరింత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించినట్టయింది. హైదరాబాద్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన విధానం పట్ల జాతీయ మీడియా కూడా స్పందించింది. కారులో ఉండగానే దాన్ని టోయింగ్గా తీసుకెళ్లడం అనేక విమర్శలకు కారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఏవీ రంగనాథ్ను వరంగల్ నగర పోలీస్ కమిషనర్గా బదిలీ చేయడం, అక్కడ ఉన్న తరుణ్ జోషికి పోస్టింగ్ ఇవ్వకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.