టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యే.. రూ.50లక్షలు అడుగుతున్నారు.. పెట్రోల్ బాటిల్తో బిల్డింగ్ ఎక్కిన టీఆర్ఎస్ నేత..
వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల వేళ టీఆర్ఎస్కు నిరసనల సెగ తగలుతోంది. నిన్నటికి నిన్న దర్శన్ సింగ్ అనే ఓ టీఆర్ఎస్ నేత బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి తనకు బీఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేయగా... తాజాగా తుమ్మల శోభారాణి అనే మరో టీఆర్ఎస్ నాయకురాలు నిర్మాణంలో ఉన్న భవనం పైకి ఎక్కి నిరసన తెలిపారు. చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకున్న ఆమె.. తనకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు.

బీఫామ్ కోసం రూ.50లక్షలు డిమాండ్...
ఉద్యమ కాలం నుంచి తాను పార్టీలో పనిచేస్తున్నానని... ఇప్పటికీ అనేక కేసుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని శోభారాణి వాపోయారు. పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా తనకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 58వ డివిజన్ టికెట్ తనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాను నామినేషన్ దాఖలు చేశానని... పార్టీ బీఫామ్ కోసం అడిగితే కొంతమంది నేతలు రూ.50లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు.

తొలి జాబితా ప్రకటించిన టీఆర్ఎస్
టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం(ఏప్రిల్ 21) ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 66 డివిజన్లకు గాను 18 డివిజన్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 2వ డివిజన్-బానోతు కల్పన సింగులాల్,5వ డివిజన్-తాడిశెట్టి విద్యాసాగర్,7వ డివిజన్-వేముల శ్రీనివాస్,13వ డివిజన్ -సురేశ్ జోషి,15వ డివిజన్-ఆకులపల్లి మనోహర్,16వ డివిజన్-సుంకరి మనీషా శివకుమార్,17వ డివిజన్-గద్దె బాబు,23వ డివిజన్-యెలుగం లీలావతి సత్యనారాయణ,27వ డివిజన్-జారతి రమేశ్,29వ డివిజన్-గుండు సుధారాణి,38వ డివిజన్-బైరబోయిన ఉమా దామోదర్,45వ డివిజన్-ఇండ్ల నాగేశ్వర్ రావు,51వ డివిజన్-బోయినపల్లి రంజిత్ రావు,55వ డివిజన్-జక్కుల రజిత వెంకటేశ్వర్లు,56వ డివిజన్-సిరంగి సునీల్ కుమార్,57వ డివిజన్-నల్ల స్వరూపరాణి,64వ డివిజన్-ఆవాల రాధిక నరోత్తం రెడ్డి,65వ డివిజన్-గుగులోత్ దివ్యారాణి రాజు నాయక్ ఉన్నారు.
మున్ముందు అవకాశాలు వస్తాయన్న ఎర్రబెల్లి...
తొలి జాబితా అభ్యర్థులకు బీ ఫారాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక సమీకరణాల రీత్యా అందరికీ టిక్కెట్లు ఇవ్వలేకపోయామని అన్నారు. అయితే టికెట్లు రానివారికి పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని.. మున్ముందు కీలక పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా చెప్పారని తెలిపారు. టికెట్లు వచ్చిన వారు టిక్కెట్లు రాని వారిని కలుపుకొని వెళ్లాలని, సమన్వయంతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. టికెట్ దక్కనివారికి మున్ముందు అవకాశాలు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications