వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లు మార్పు: ప్రభుత్వ జీవో జారీ
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల పేర్ల మార్పుపై అభ్యంతరాలు, వినతులకు నెల రోజుల సమయం ఇచ్చింది.
కాగా, హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొనసాగుతుంది. ఇందులో హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, హసన్పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలు ఉండనున్నట్లు సమాచారం.

మరోవైపు వరంగల్, ఖిలా వరంగల్, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట, నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం మండలాలు వరంగల్ జిల్లాలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు జిల్లాల పేర్లు మారుస్తున్నట్లు జూన్ 21న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications