జంగారెడ్డిగూడెం ఇన్సిడెంట్: రంగంలోకి ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్.. బెల్లం ఊట ధ్వంసం
జంగారెడ్డిగూడెం మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇంట బయట విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. నాటుసారా తయారీ, నిల్వలపై ఉక్కుపాదం మోపారు. అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నారు.

54 కేసులు.. 34 మంది అరెస్ట్
ఈ నెల 10వ తేదీ నుంచి నిన్నటి వరకు జరిగిన తనిఖీల్లో 54 కేసులు నమోదు చేశారు. 34 మందిని అరెస్ట్ కూడా చేస్తారు. మొత్తం 315 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా.. 24 వేల 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 63 వేల 48 కేజీల బెల్లాన్ని సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతునే ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ పోలీసులు భారీగా నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

10 వేల లీటర్ల బెల్లం
ఏటపాక మండలం గుండువారి గూడెంలో నాటు సారా స్థావరాలపై చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో నాటు సారా తయారికి ఉపయోగించే పదివేల లీటర్ల బెల్లం ఊట, రవాణాకు సిద్ధంగా ఉన్న 70 లీటర్ల నాటు సారా, సారా తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని ఏఎస్పీ కృష్ణకాంత్ అన్నారు.

జ్యుడిషీయల్ ఎంక్వైరీ
జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిగే వరకూ తాము పోరాడుతామని టీడీపీ నేత లోకేశ్ అన్నారు. సహజ మరణాలైతే ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదుచేశారని నిలదీశారు. 4 రోజుల్లో 18వేల 300 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారని, 63 టన్నుల నల్ల బెల్లాన్ని సీజ్ చేశారని లోకేశ్ చెప్పారు. నాటు సారా బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహజ మరణాల పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications