మోడీ పాదాభివందనం.. ఆమె ఎవరంటే..? బెలూన్ ఇష్యూపై ఎస్పీజీ సీరియస్
ప్రధాని మోడీ భీమవరం పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ స్వాతంత్ర్య సమరయోధులను కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్వతగానే పెద్దలను ప్రధాని మోడీ గౌరవిస్తారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రముఖ స్వాతంత్ర్య సమరమోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
వారి కుమార్తె పసల కృష్ణభారతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కూడా వృద్దురాలే.. 90 ఏళ్ల కృష్ణభారతి వీల్ చెయిర్ లో ఉండగా, మోడీ ఆమెకు పాదాభివందనం చేశారు. శాలువా కప్పి సన్మానించారు. కృష్ణభారతి సోదరిని, మేనకోడలిని కూడా మోడీ కలిశారు. మోడీ ఆమెను గౌరవించారు. తన తల్లికి మోడీ ఇప్పటికీ పాదాభివందనం చేస్తారు
ఇటు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి భీమవరంకు మోదీ హెలికాప్టర్లో వెళ్లే సమయంలో కొందరు వ్యక్తులు నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. ఘటనపై ఎస్పీజీ సీరియస్ అయ్యింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇది భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ కామెంట్ చేసింది. బెలూన్ల తరహాలో డ్రోన్లను ఎగురవేసి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని చెప్పారు.
నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లను ఎగురవేశారని అన్నారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదని... నోటితో గాలి ఊది బెలూన్లను ఎగరేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బెలూన్లను ఎగురవేశారని తెలిపారు. సుంకర పద్మశ్రీ, సావిత్రి, రాజీవ్ రతన్ ఘటనకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. మోడీ పర్యటనలో సీఎం జగన్, మంత్రి రోజా పాల్గొన్నారు. చిరంజీవి కూడా విచ్చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆహ్వానం రాకపోవడంతో చివరి క్షణంలో ఆగిపోయారు. కానీ ఆయనను ఏపీ సీఐడీ నీడలా వెంటాడుతుంది. అందుకోసమే రాలేదని చర్చ జరుగుతుంది.