పవన్ థాంక్స్: సీఐడీ దాడి కామెంట్స్పై రఘురామ, వీడియో షేర్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై జగన్ సర్కార్ కక్షసాధింపు చర్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఇదీ ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై రఘురామ స్పందించారు. ఆయనకు థాంక్స్ చెప్పి.. వీడియోను కూడా పంచుకున్నారు. ఇవాళ భీమవరంలో జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
రఘురామను గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సొంత పార్టీలో సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులతో లాక్కొచ్చి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అరికాళ్లపై కొట్టించి, నడవలేకుండా చేశారని వివరించారు. మొన్న సొంత నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితులు తీసుకువచ్చారని వెల్లడించారు. రఘురామకృష్ణరాజు మీద చేసిన దాడిలా చూడడంలేదని, క్షత్రియులందరిపై వైసీపీ చేసిన దాడిగా చూస్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పులివెందులలో ఇలా చేస్తే ఒప్పుకుంటారా? అని పవన్ కల్యాణ్ అడిగారు. కులాలుగా విడిపోవడం దురదృష్టకరం అన్నారు. రఘురామకృష్ణరాజు తన కులం కాదని.. కానీ సాటి మనిషి అని తెలిపారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి.. అయినప్పటికీ, ప్రజాస్వామ్యంలో మాట మాట్లాడితే అందుకు బదులివ్వడం అనేది ఉంటుంది. అందుకు ఓ పరిమితి ఉంటుందని కామెంట్ చేశారు. పవన్ వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు స్పందించారు.
పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఐడీ పోలీసులు తనపై చేసిన క్రూరమైన దాడిని ఖండించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యల వీడియోను కూడా రఘురామ పంచుకున్నారు.