నాదెండ్ల మనోహర్ చేసిన పనికి..!!
జనసేన 10వ ఆవిర్భావ సభ పోస్టర్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవ్వాళ తాడేపల్లిగూడెంలో ఆవిష్కరించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అమరావతి: జనసేన పార్టీ.. ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సన్నద్ధమౌతోంది. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేయనుంది. ఇది- జనసేన 10వ ఆవిర్భావ సభ. దీన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు వారాహి వాహనంలో వేదిక వద్దకు చేరుకోనున్నారు. సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో సభను నిర్వహిస్తామని జనసేన తెలిపింది.

పోస్టర్ రిలీజ్..
ఆవిర్భావ సభ పోస్టర్ కొద్దిసేపటి కిందటే ఆవిష్కృతమైంది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. దీన్ని ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ పోస్టర్ ను ఆవిష్కరించారాయన. 10వ ఆవిర్భావ సభ కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నామని, ఇదివరకెప్పుడూ లేనివిధంగా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ పెద్ద ఎత్తున జనసైనికులు దీనికి హాజరు కానున్నట్లు తెలిపారు.

లక్ష్యం అదే..
2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నందున- జనసేన అనుసరించబోయే వ్యూహాలు, లక్ష్యాల గురించి ఈ సభా వేదికపై నుంచి పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. తమ లక్ష్యం ఒక్కటేనని, అది- వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించుకోవడమేనని పేర్కొన్నారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ అధ్యక్షుడు వివరిస్తారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే క్యాడర్ ను సర్వ సన్నద్ధులను చేస్తారని అన్నారు.

అణచివేత..
ప్రశ్నించే గొంతుకలను జగన్ ప్రభుత్వం అణచివేస్తోందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నిస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి- నిజంగా దమ్ముంటే 26 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాటం చేయడంలో తామే ముందంజలో ఉన్నామని, దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.

వ్యతిరేక ఓటు చీలనివ్వం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ సైతం ఇదివరకే ఇప్పటం సభలో ప్రకటించారని గుర్తు చేశారు. తమ పార్టీకి ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, రికార్డుస్థాయిలో పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కావడమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

పవన్ చెప్పినా..
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమౌతోంది. విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు 2023 కొనసాగుతున్న నేపథ్యంలో- ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయబోమని పవన్ కల్యాణ్ ఇదివరకే ప్రకటించారు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అంటూ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్ల సమ్మిట్ ను నిర్వహిస్తోన్నందున జగన్ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు సైతం తెలియజేశారు. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.

వైసీపీ ట్రోల్స్..
పవన్ కల్యాణ్ ఈ ప్రకటన చేసి- 24 గంటలు కూడా గడవకముందే నాదెండ్ల మనోహర్.. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ట్రోల్స్ చేస్తోన్నారు. పవన్ కల్యాణ్ మాట మీద నిలబడే నాయకుడు కాదనే విషయం మరోసారి రుజువైందనీ చెబుతున్నారు. ఈ విమర్శలు నేరుగా పవన్ కల్యాణ్ చేయకపోయినప్పటికీ- పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ హోదాలో నాదెండ్ల మనోహర్ వ్యవహారాన్ని వైసీపీ నాయకులు తప్పుపడుతున్నారు.. ట్రోల్ చేస్తోన్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications